అక్షరటుడే, వెబ్డెస్క్ : Paddy Bonus | రాష్ట్ర ప్రభుత్వం (State Government) అన్నదాతలకు షాక్ ఇచ్చింది. బోనస్ విషయంలో కీలక ప్రకటన చేసింది. ఏడు రకాల సన్నాలకు మాత్రమే క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామని తెలిపింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
తాము అధికారంలోకి వస్తే వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ (Congress) హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని సన్నాలకు మాత్రమే పరిమితం చేసింది. సన్నరకం సాగు చేసేవారికి క్వింటాల్కు రూ.500 ఇస్తామని తెలిపింది. 33 రకాల సన్నాల జాబితాను గతంలో విడుదల చేసింది. అయితే తాజాగా ఆ సంఖ్యను ఏడు తగ్గించింది. మార్కెట్లో డిమాండ్ ఉన్న ఏడు రకకాల పంటలు సాగు చేసిన వారికి మాత్రమే బోనస్ ఇస్తామని స్పష్టం చేసింది.
Paddy Bonus | 26 రకాలు తొలగింపు
గతంలో ప్రభుత్వం 33 రకాల సన్నరకం వడ్లకు బోనస్ ఇచ్చేది. అది కూడా వానాకాలం సీజన్లో మాత్రమే చెల్లించింది. యాసంగిలో బోనస్ ఇవ్వడం లేదు. తాజాగా ఇందులో నుంచి 26 రకాలను ప్రభుత్వం తొలగించింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు వరినార్లు పోశారు. నార్లు పోయకముందే చెబితే ప్రభుత్వం చెప్పిన రకాలు సాగు చేసేవాళ్లమని.. ఇలా ఆలస్యంగా ప్రకటనం చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Paddy Bonus | ఈ రకాలకే..
బీపీటీ-5204 (సాంబమసూరి), ఆర్ఎన్ఆర్-15048 (తెలంగాణ సోనా), హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్ఎం-1638 (కూనారం సన్నలు), డబ్ల్యూజీఎల్-44 (సిద్ది), కేఎన్ఎం-7715 లాంటి 7 రకాల వడ్లకే బోనస్ చెల్లించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విత్తనాలను అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖను ఆదేశించింది. అయితే పలు జిల్లాల్లో ఇప్పటికే నార్లు పోయడం పూర్తయింది. మరికొన్ని జిల్లాల్లో నాట్లు కూడా వేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం బోనస్ విషయంలో ఇలాంటి ప్రకటన చేయడంపై అన్నదాతలు మండిపడుతున్నారు. చాలా మంది రైతులు చిట్టి ముత్యాలు, కావేరి, జెయింట్ బీపీటీ, నెల్లూరు సన్నాలు లాంటి వడ్ల రకాలు సాగు చేస్తారు. తమ పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Road Accident Deaths | రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురి మృతి