అక్షరటుడే వెబ్డెస్క్: Priyanka Murder Case | తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రియాంక హత్యకేసు దర్యాప్తును ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది. ఈ కేసును సమగ్రంగా విచారించేందుకు దర్యాప్తు అధికారికంగా ఐపీఎస్ అధికారి పాటిల్ దేవరాజ్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయనకు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను అప్పగించారు. అన్ని కోణాల్లో లోతైన విచారణ జరిపి, నిందితులకు త్వరగా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
Priyanka Murder Case |ఘటన నేపథ్యం..
తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్ఎల్ వైద్య కళాశాలలో డాక్టర్ ప్రియాంక డెర్మటాలజీ విభాగంలో పీజీ ఫస్టియర్ అభ్యసిస్తున్నారు. ఈ నెల 3న రాత్రి రాజమండ్రిలోని ప్రసాద్ ఆదిత్య మాల్లో సినిమా చూసేందుకు తన తోటి క్లాస్మేట్తో కలిసి స్కూటీపై బయలుదేరారు. థియేటర్ గేటు వద్ద వాహనాలు నిలిచి ఉన్న సమయంలో.. నామవరానికి చెందిన సురవరపు దుశ్వంత్, లాలాచెరువుకు చెందిన ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ మద్యం మత్తులో కారును అతివేగంగా నడుపుతూ వచ్చి వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు.
అంతటితో ఆగకుండా మరోసారి కారుతో ఢీకొట్టి ఆమె పైనుంచి పోనివ్వడంతో ప్రియాంక కిందపడి తలకు తీవ్రగాయాలపాలయ్యారు. మెరుగైన వైద్యం కోసం ఈ నెల 6న సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, తీవ్రగాయాల కారణంగా వైద్యుల ప్రయత్నాలు ఫలించక ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో త్వరలోనే విచారణ ప్రక్రియ వేగవంతం కానుంది.
ఇది కూడా చదవండి: Ashish Banerjee Suicide | రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశా.. సూసైడ్ నోట్లో టీఎంసీ మాజీ ఎమ్మెల్యే