అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Professor Jayashankar | తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్లో గురువారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జయశంకర్ జయంతిని నిర్వహించారు. కలెక్టర్ భవేష్ మిశ్రా (Collector Bhavesh Mishra) ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
Professor Jayashankar | తెలంగాణ సమాజానికి ఆయన చేసిన సేవలు అమోఘం..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆచార్య జయశంకర్ అందించిన సేవలను కొనియాడారు. తెలంగాణ భావజాలాన్ని ఎంతో గొప్పగా ముందుకు తీసుకెళ్లిన మహనీయుడని ప్రశంసించారు. 1969 ఉద్యమంతో పాటు మలి విడత ఉద్యమంలోనూ ప్రజలను ప్రత్యేకించి విద్యార్థులు, యువతను ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగస్వామ్యం చేశారని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధనే ఆశ, శ్వాసగా ఆరు దశాబ్దాల పాటు సుదీర్ఘంగా అలుపెరుగని కృషి చేస్తూ ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు.
Professor Jayashankar | అధికారికంగా జయంతి..
జయశంకర్ సేవలను స్మరించుకునేలా ప్రభుత్వం అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహిస్తోందని కలెక్టర్ తెలిపారు. అందుకే వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టారన్నారు. అంతకుముందు కంఠేశ్వర్ చౌరస్తాలో ఆచార్య జయశంకర్ విగ్రహానికి అదనపు కలెక్టర్ వి.భుజంగరావు పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, ట్రెయినీ కలెక్టర్ సురేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, డీఆర్వో గీత, ఆర్డీవో రాజేంద్ర కుమార్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ సందీప్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఇన్ఛార్జి అధికారిణి రజిత, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: GPO ACB Trap | రూ.5 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన జీపీవో