అక్షరటుడే, న్యూఢిల్లీ: Raghav Chadha | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మాజీ నేత, ప్రస్తుత బీజేపీ ఎంపీ రాఘవ్ చడ్డా తన పాత పార్టీపై విమర్శల దాడిని ఉధృతం చేశారు. కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ‘అవినీతిపరుల అడ్డా’గా మారిందని ఆయన ఆరోపించారు. పార్టీని వీడటం వెనుక ఎలాంటి భయం లేదని, కేవలం పార్టీ ప్రస్తుత తీరుపై కలిగిన విరక్తి వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
Raghav Chadha | అద్దాల మేడ వివాదం
మీడియాతో మాట్లాడిన రాఘవ్ చడ్డా.. ఢిల్లీ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ‘శీష్ మహల్’ వివాదాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. అద్దాల మేడ వివాదం వల్ల ఆప్ ప్రతిష్ఠ మసకబారిందని, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి అదే ప్రధాన కారణమని విశ్లేషించారు.
శీష్ మహల్ పార్ట్ 2: ఎన్నికలు ముగిసిన ఏడాది లోపే ‘శీష్ మహల్ పార్ట్ 2’ తెరపైకి రావడం దారుణమని ఆయన ఎద్దేవా చేశారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన నిజాయితీ గల కార్యకర్తలు, నేతలు ఇప్పుడు ఆప్ను వీడుతున్నారని చడ్ఢా తెలిపారు.
భయం లేదు నిరాశే మిగిలింది: తనతో పాటు మరో ఆరుగురు ఎంపీలు భయంతో పార్టీని వీడలేదని, పార్టీలో నెలకొన్న నిరాశ, నిస్పృహ, అసహ్యం వల్లే బయటకు వచ్చామని స్పష్టం చేశారు. ఆ పార్టీ ఇప్పుడు దేశం కోసం కాకుండా, కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పనిచేస్తోందని ఆరోపించారు. ఆ పార్టీ చేస్తున్న నేరాల్లో తాను భాగం కావాలని అనుకోవడం లేదని అందుకే తప్పుకున్నానని వివరించారు.
Raghav Chadha | పార్టీని వీడిన కొద్ది గంటల్లోనే..
దాదాపు ఏడాది పాటు కేజ్రీవాల్ వెంటే ఉన్న రాఘవ్ చడ్డా, పార్టీని వీడిన కొద్ది గంటల్లోనే బీజేపీ కండువా కప్పుకోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. పార్టీ ఇప్పుడు రాజీపడిన నేతల చేతుల్లోకి వెళ్ళిపోయిందని, సరైన దారిలో లేని పార్టీలో ఉండటం తనకు ఇష్టం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు.

ఇది కూడా చదవండి..: Raghav Chadha BJP | రాఘవ్ చద్దా బీజేపీలోకి ఎంట్రీ.. 10 లక్షల మంది ఫాలోవర్లు ఎగ్జిట్!

