అక్షరటుడే వెబ్డెస్క్: Rahul Gandhi Comments | నీట్ పరీక్షల అక్రమాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన ‘సంసద్ చలో’ నిరసన ప్రదర్శనలో విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీలో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు దాడి చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను మీడియా వేదికగా ప్రదర్శించారు.
Rahul Gandhi Comments | 152 పేపర్లు లీక్..
దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు 152 ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. దీనివల్ల దాదాపు 7.5 కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తు తీవ్రంగా దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని, మధ్యతరగతి కుటుంబాలకు విద్య అత్యంత భారంగా మారిందని విమర్శించారు. నీట్ పరీక్షల నిర్వహణ కోసం రూ.1.52 లక్షల కోట్లు ఖర్చు చేసినప్పటికీ, అడుగడుగునా నిర్లక్ష్యమే కనిపిస్తోందని మండిపడ్డారు.
Rahul Gandhi Comments | పెరుగుతున్న చైనా వస్తువులు..
నీట్ రాసే ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.1.32 లక్షల ఖర్చు అవుతోందని, కానీ పరీక్షల్లో ఎలాంటి పారదర్శకత లేదని రాహుల్ అన్నారు. దేశంలో యువతకు ఉద్యోగాలు లేకుండా పోతున్నాయని, విద్యార్థుల ఆశలు, ఆకాంక్షలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో చైనా వస్తువుల సంఖ్య పెరిగిపోతోందని, పరిశ్రమలు మూతపడుతున్నాయని అన్నారు. బ్యాంకులను బడా వ్యాపారులు లూఠీ చేస్తున్నారని, కృత్రిమ మేధ (AI) వల్ల కార్పొరేట్ ఉద్యోగాలు గల్లంతవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Rahul Gandhi Comments | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..
విద్యా శాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ ( Dharmendra Pradhan )పూర్తిగా విఫలమయ్యారని, ఆయన తక్షణమే రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి యువత జవాబుదారీతనాన్ని కోరుకుంటోందని, విద్యార్థులకు ప్రధాని మోడీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Rajnath Singh Comments | నీట్ లీక్ వివాదం.. ప్రతిపక్షాల తీరును తప్పుబట్టిన రాజ్నాథ్ సింగ్