అక్షరటుడే, వెబ్డెస్క్: RTC Strike Talks | ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించాలని రాష్ట్ర మంత్రిమండలి విజ్ఞప్తి చేసింది. చర్చల ద్వారా కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలియజేసింది. చర్చలకు రావాలని కార్మిక సంఘాలను ఆహ్వానించింది.
కార్మిక సంఘాల ప్రతినిధులతో రేపు (శుక్రవారం) చర్చలు జరపాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల బృందానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సుదీర్ఘంగా చర్చించింది. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని సమావేశంలో ముఖ్యమంత్రి సూచించారు.
RTC Strike Talks | కమిషన్ నియామకాన్ని
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు విషయాన్ని మంత్రివర్గ సమావేశం చర్చించింది. జ్యుడీషియల్ కమిషన్ నియామకాన్ని హైకోర్టు తప్పుబట్టలేదని, పైగా కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమని, రాజ్యాంగబద్ధమని కూడా అభిప్రాయపడిందని సమావేశంలో అడ్వకేట్ జనరల్ తీర్పు వివరాలను వెల్లడించారు.
ఆ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని దీనిపై న్యాయనిపుణులతో చర్చించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది.
RTC Strike Talks | భూసేకరణ ప్రక్రియ..
మంథని నియోజకవర్గ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. అలాగే, మంచిర్యాల జిల్లా హాజీపూర్ రెవెన్యూ పరిధిలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిసరాల్లో ఇంటిగ్రేటెడ్ అక్వా పార్క్ను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపారు.
ఈ వివరాలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వాకిటి శ్రీహరి పత్రికా సమావేశంలో వెల్లడించారు.
అంతకుముందు మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విడిగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి కట్టుబడి ఉందని, కార్మికుల డిమాండ్లపై చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ సమయంలో కార్మికులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.
కార్మికులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, అనాలోచిత చర్యలకు పాల్పడి తమ కుటుంబాలకు అన్యాయం చేయొద్దని కోరారు. క్షణికావేశంలో ఆత్మబలిదానాలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం పూర్తిగా సానుకూల దృక్పథంతో ఉందని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు.
ఇది కూడా చదవండి..: RTC Strike | కల్వకుర్తిలో ఉద్రిక్తత.. ప్రైవేట్ బస్సు డ్రైవర్పై కారం చల్లిన ఆర్టీసీ కార్మికులు!

