RTC Workers Issues | ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కమిటీ : మంత్రి పొన్నం ప్రభాకర్​

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RTC Workers Issues | ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్​ (Ponnam Prabhakar) అన్నారు. ఈ మేరకు కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

తమ డిమాండ్లు నెరవేర్చకపోతే బుధవారం నుంచి సమ్మెకు వెళ్తామని ఆర్టీసీ జేఏసీ (RTC JAC) నాయకులు ప్రకటించారు. ఈ క్రమంలో మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగవద్దనే ఆలోచనతో ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్​పై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. నిర్ణయాలు తీసుకునే అంశంలో కొంత జాప్యం జరగవచ్చని చెప్పారు. కార్మికులు లేవనెత్తిన అంశాలు పరిశీలించడానికి నలుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

RTC Workers Issues | సీఎంతో చర్చిస్తా

ఆర్టీసీ ప్రతినిధులంతా కమిటీకి తమ డిమాండ్లు చెబితే వాటిని తాను, డిప్యూటీ సీఎం కలిసి ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy)తో చర్చిస్తామని పొన్నం అన్నారు. అధికారుల నివేదిక ఆధారంగా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నిత్యం ఆర్టీసీలో 65 లక్షల మంది ప్రయాణిస్తారని ఆయన చెప్పారు. వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలని కార్మికులను కోరారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం ప్రయాణికుల సౌలభ్యం చూస్తామన్నారు.

rtc bus

RTC Workers Issues | కమిటీలో సభ్యులు వీరే..

టీజీఎస్ఆర్టీసీకి సంబంధించిన సమస్యలను పరిశీలించడానికి అధికారుల కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ ఛైర్మన్​గా రవాణా, రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తారు. సభ్యులుగా కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ వైస్​ ఛైర్మన్​, ఎండీ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఆర్టీసీ కార్మికుల నుంచి వినతులు స్వీకరిస్తుంది. నాలుగు వారాల వ్యవధిలో ప్రభుత్వానికి నివేదిక అందిస్తుంది. ఆ నివేదిక ఆధారంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అయితే కమిటీ ఏర్పాటుపై కార్మిక నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

]

దీనిని కూడా చదవండి : RDO Caught by ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్డీవో

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *