అక్షరటుడే వెబ్డెస్క్: Supreme Court Bribery Case | కేవలం రూ.20 లంచం తీసుకున్నారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు 30 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత ఎట్టకేలకు నిర్దోషులుగా బయటపడ్డారు. ఈ కేసులో గుజరాత్కు ( Gujarat )చెందిన ఇద్దరు ఉద్యోగులను దోషులుగా తేలుస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ అతుల్ ఎస్ చందూల్కర్లతో కూడిన ధర్మాసనం ఈ సంచలన తీర్పు వెలువరించింది. లంచం డిమాండ్ చేసినట్లు ఎలాంటి స్పష్టమైన రుజువులు లేవని, కేవలం రూ.20 రికవరీ అయినంత మాత్రాన వారిని దోషులుగా నిర్ధారించలేమని కోర్టు తేల్చిచెప్పింది.
Supreme Court Bribery Case | అసలు ఏం జరిగిందంటే?
1996 ఫిబ్రవరిలో గుజరాత్ ఆనంద్ జిల్లాలోని బెచ్రీ గ్రామానికి చెందిన ఓ విద్యార్థి ఆదాయ ధ్రువీకరణ పత్రం (Income Certificate) కోసం స్థానిక పంచాయతీలో దరఖాస్తు చేసుకున్నాడు. అక్కడ పనిచేసే క్లర్క్ రూ.120 లంచం డిమాండ్ చేశాడని, అందులో రూ.100 తనకు కాగా, మరో రూ.20 ఫ్యూన్ కోసం అని అడిగాడని ఆ విద్యార్థి ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన అధికారులు ట్రాప్ ఏర్పాటు చేశారు. డబ్బులు తీసుకుని సర్టిఫికేట్ ఇస్తుండగా ఫ్యూన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అతని వద్ద నుంచి రూ.20 స్వాధీనం చేసుకున్నారు. అయితే, క్లర్క్ డిమాండ్ చేశాడన్న రూ.100 మాత్రం ఎక్కడా లభించలేదు.
ఈ నేపథ్యంలో.. కేవలం నగదు దొరికినంత మాత్రాన లంచం తీసుకున్నట్లు నిరూపితం కాదని, డిమాండ్ చేసినట్లు బలమైన ఆధారాలు ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఫిర్యాదుదారుడి వాంగ్మూలంలోనూ పలు వైరుధ్యాలు ఉన్నాయని కోర్టు పేర్కొంటూ ఇద్దరు ఉద్యోగులను నిర్దోషులుగా ప్రకటించింది.
ఇది కూడా చదవండి: ACB Raids on Tahsildar | తహశీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు