అక్షరటుడే వెబ్డెస్క్: Surat Gas Leak | ప్రముఖ పారిశ్రామిక నగరం గుజరాత్లోని సూరత్లో ( Surat ) తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ జ్యువెలరీ తయారీ కేంద్రంలో విషవాయువు లీక్ కావడంతో ఒక సూపర్వైజర్తో పాటు ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రసాయన వ్యర్థాల ట్యాంకును శుభ్రం చేసే క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది.
Surat Gas Leak | ఒకరిని కాపాడబోయి..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరత్లోని అశ్విని కుమార్ రోడ్డు పరిధిలో ఉన్న ఓ జ్యువెలరీ తయారీ ఫ్యాక్టరీలో రసాయన వ్యర్థాలను సేకరించేందుకు ఆవరణలోనే ఈటీపీ (Effluent Treatment Plant) సెప్టిక్ ట్యాంక్ను ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం ప్రతి రెండు నెలలకు ఒకసారి ఈ ట్యాంక్ను క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ఆదివారం ఉదయం సూపర్వైజర్ ఆధ్వర్యంలో ముగ్గురు కార్మికులు ట్యాంక్ను శుభ్రం చేయడానికి వెళ్లారు. అయితే పనులు జరుగుతున్న సమయంలో ఒక కార్మికుడు ప్రమాదవశాత్తు ట్యాంక్ లోపలికి జారిపడిపోయాడు. అతడిని రక్షించేందుకు మిగిలిన ముగ్గురు కూడా ఒకరి తర్వాత ఒకరు ట్యాంక్ లోపలికి దిగారు. కానీ, అప్పటికే ఆ ట్యాంక్లో పేరుకుపోయిన రసాయనాల వల్ల తీవ్రమైన విషవాయువులు వెలువడ్డాయి. దీంతో ఊపిరాడక నలుగురూ అక్కడికక్కడే స్పృహతప్పి ప్రాణాలు విడిచారు.

Surat Gas Leak | సేఫ్టీ మాస్క్లు లేకపోవడమే..
ఈ ఘోర ప్రమాదంపై డీసీపీ (DCP) అలోక్ కుమార్ స్పందిస్తూ.. సీసీటీవీ (CCTV) ఫుటేజీని పరిశీలించగా కార్మికులు ఎలాంటి కనీస రక్షణ మాస్కులు (Safety Masks) ధరించకుండానే ట్యాంక్లోకి దిగినట్లు గుర్తించామని తెలిపారు. ట్యాంక్లోని పాయిజనస్ గ్యాస్ పీల్చడం వల్లే వారు మరణించి ఉంటారని భావిస్తున్నామని, పూర్తి వివరాలు పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చాకే తెలుస్తాయని పేర్కొన్నారు.
Surat Gas Leak | ట్యాంక్లోకి దిగడం వల్లే..
ట్యాంక్ లోపలికి దిగేముందు సూపర్వైజర్ ఫైర్ సిబ్బందికి సమాచారం అందించినప్పటికీ.. వారు ఘటనా స్థలానికి చేరుకునే లోపే అత్యుత్సాహంతో కార్మికులు ట్యాంక్లోకి దిగడం వల్లే ఈ ఘోరం జరిగిందని డీసీపీ వివరించారు. ప్రస్తుతం మృతదేహాలను ట్యాంక్ నుండి వెలికితీసి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

ఇది కూడా చదవండి: Giant Fish Catch | గంగపుత్రులకు చిక్కిన భారీ చేప
