అక్షరటుడే, తాడ్వాయి: Tadwai BRS | కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ఆ పార్టీ రైతుల పాలిట యముడిలాగా తయారైందని మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పుల్గం సాయి రెడ్డి అన్నారు. తాడ్వాయి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
Tadwai BRS | అబద్ధపు హామీలతో గద్దెనెక్కి..
ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో అబద్దపు హామీలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుటికే రైతులకు రెండుసార్లు రైతుబంధు (Rythu Bandhu) ఎగ్గొట్టాడన్నారు. ఫర్టిలైజర్ పేరుతో యాప్ పెట్టిన ప్రభుత్వం రైతులు యూరియా బుక్ (Urea Crisis) చేసుకుంటే నెట్వర్క్ సమస్యలు వస్తున్నాయని తెలిపారు. పంటలు వేసే సమయానికి ఎరువులు లేక రైతులు ఇబ్బంది పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిసస్తోందన్నారు. సర్వర్ సమస్యలు వస్తున్నాయని వాటిని పరిష్కరించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. తెలంగాణలో చాలామంది రైతులు చదువు రాని వాళ్లు ఉన్నారని, స్మార్ట్ ఫోన్ లేని రైతులు ఉన్నారని, వాళ్లు యూరియా ఎలా బుక్ చేసుకుంటారని ప్రశ్నించారు. వెంటనే యూరియా యాప్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంప్లెక్స్ ఎరువుల ధర నెల రోజుక్రితం రూ.1300 ఉందని, ఇప్పుడు రూ.2,450కి పెంచడం దారుణమన్నారు.
Tadwai BRS | కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణ రైతులను దారుణంగా మోసం చేస్తున్నాయని, ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం దగ్గర పడిందన్నారు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన ఎవుసం బాగుపడలేదని తెలిపారు. మండల కన్వీనర్ ముదాం నర్సింలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తుందని, 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో పూర్తిగా విఫలమైందన్నారు.
మార్కెట్ కమిటీ ఛైర్మన్ కపిల్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు బీమా కోసం చెల్లించే రూ.4,600 కోట్లు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించలేదని, అందుకే రైతు బీమా పథకంలో జాప్యం జరుగుతుందన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రైతు బీమా, రైతు బంధు ఏ రోజు కూడా ఆపలేదని గుర్తుచేశారు. యూరియా యాప్ ఎత్తివేయకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మైపాల్ రెడ్డి, రాము, నర్సింలు, గోపాలరావు, తాజుద్దీన్, రవీందర్ రెడ్డి, రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
