అక్షరటుడే, కామారెడ్డి : Urea Shortage Protest | రామారెడ్డి మండలం (Rama Reddy Mandal) ఉప్పల్వాయి గ్రామంలో ఆదివారం రైతన్నలు రోడ్డెక్కారు. ఖరీఫ్ సాగు ఊపందుకున్న తరుణంలో పొలాలకు యూరియా దొరక్క రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Urea Shortage Protest | యూరియా యాప్తో ఇబ్బందులు..
ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్ విధానం తమ పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. స్మార్ట్ఫోన్ లేని వృద్ధ రైతులు, ఫోన్ సౌకర్యం లేని పల్లెవాసులు యాప్లో నమోదు చేసుకోలేక బస్తా యూరియా కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని కన్నీటిపర్యంతమయ్యారు. వెంటనే యూరియా యాప్ విధానాన్ని రద్దు చేసి, గతంలో మాదిరిగానే సొసైటీలు, డీలర్ల ద్వారా నేరుగా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించారు. వరి నాట్లు వేసే సమయం దాటిపోతున్నా చేతికి బస్తా రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయమే జీవనాధారమైన తమను ప్రభుత్వం సాంకేతికత పేరుతో ఇబ్బందులకు గురిచేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.
Urea Shortage Protest | స్తంభించిన రవాణా..
రాస్తారోకో కారణంగా ఉప్పలవాయి-రామారెడ్డి ప్రధాన రహదారిపై దాదాపు గంటపాటు వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడుతున్నారు. రైతుల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తమ డిమాండ్ నెరవేరకపోతే మరోసారి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రైతు సంఘాల నాయకులు ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఇది కూడా చదవండి..: Kamareddy Ganja Seizure | కామారెడ్డిలో భారీగా గంజాయి పట్టివేత..! సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్న అధికారులు