అక్షరటుడే, వెబ్డెస్క్: Tamil Nadu Cabinet Expansion | తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మంత్రివర్గాన్ని విస్తరించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి రెండు మంత్రి పదవులు ఇచ్చారు. అయితే రాష్ట్రంలో 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేయడం గమనార్హం.
ప్రమాణ స్వీకారం చేసిన రెండు వారాల తర్వాత ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) గురువారం తన మంత్రివర్గాన్ని విస్తరించారు. 23 మంది ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మంత్రివర్గంలో చేరిన వారిలో సేలం సౌత్ ఎమ్మెల్యే తమిళ పార్థిబన్, అరంతంగి ఎమ్మెల్యే జె మహమ్మద్ ఫర్వాస్ అలియాస్ పర్వేజ్, కోయంబత్తూరు నార్త్ ఎమ్మెల్యే వి సంపత్ కుమార్, కాంచీపురం ఎమ్మెల్యే ఆర్ వి రంజిత్ కుమార్, తాంబరం ఎమ్మెల్యే డి శరత్ కుమార్, తిరుప్పూర్ నార్త్ ఎమ్మెల్యే వి సత్యభామ, ఆర్ కె నగర్ ఎమ్మెల్యే మేరీ విల్సన్ ఉన్నారు. దాదాపు 60 ఏళ్ల తర్వాత తమిళనాడు మంత్రివర్గంలోకి కాంగ్రెస్ కూడా ప్రవేశించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజేష్ కుమార్, పి విశ్వనాథన్ మంత్రులుగా ప్రమాణం చేశారు.
Tamil Nadu Cabinet Expansion | 6 దశాబ్దాల తర్వాత
తమిళనాడులో కాంగ్రెస్ చివరగా 1962లో సీఎం పదవి దక్కించుకుంది. అనంతరం 1967 నుంచి అక్కడ డీఎంకే హవా మొదలైంది. అనంతరం అన్నా డీఎంకే పార్టీ (AIADMK Party) ఏర్పాటు కావడంతో ఆ రెండు పార్టీల మధ్య అధికారం మారుతూ వస్తుంది. కాంగ్రెస్ అధికారానికి దూరంగా ఉండటంతో పాటు పలు సందర్భాల్లో డీఎంకేతో పొత్తు పెట్టుకుంది. అయితే పొత్తు పెట్టుకున్నప్పటకీ.. దాదాపు ఆరు దశాబ్దాలుగా కాంగ్రెస్ మంత్రివర్గంలో చోటు సాధించలేకపోయింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు సీట్లలో మాత్రమే గెలిచినా.. రెండు మంత్రి పదవులు దక్కించుకోవడం గమనార్హం.
Tamil Nadu Cabinet Expansion | మెజారిటీ తక్కువ కావడంతో..
అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన టీవీకే 108 స్థానాల్లో విజయం సాధించింది. అయితే మెజారిటీ రాకపోవడంతో కాంగ్రెస్తో పాటు వీసీకే, కమ్యూనిస్ట్ పార్టీలు, ముస్లింలీగ్ మద్దతు తెలిపాయి. దీంతో ఆయన కాంగ్రెస్కు మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారు. రానున్న రోజుల్లో ఐయూఎంఎల్, వీసీకే కూడా విజయ్ మంత్రివర్గంలో చేరే అవకాశం ఉంది. ఈ రెండు పార్టీలకు చెరో సీటు లభించే అవకాశం ఉందని సమాచారం.
ఇది కూడా చదవండి..: Oil Tankers in Hormuz | భారత్ సాహసం.. హార్ముజ్ జలసంధిలోకి చమురు నౌకలు!


