అక్షరటుడే, వెబ్డెస్క్ : Telangana railway projects | తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) స్పష్టం చేశారు. మే 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) హైదరాబాద్ పర్యటనకు రానున్నారని, ఈ సందర్భంగా రూ.7,823 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని ఆయన వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలను పంచుకున్నారు.
Telangana railway projects | ప్రధాని పర్యటన విశేషాలు
ములుగు (Mulugu) జిల్లాలో ఏర్పాటు చేయనున్న సమ్మక్క-సారలమ్మ గిరిజన విశ్వవిద్యాలయ క్యాంపస్ నిర్మాణ పనులకు త్వరలోనే అంక్యురార్పణ జరగనుంది. హైదరాబాద్లో పెట్రోలియం ఉత్పత్తుల టెర్మినల్ను ప్రధాని జాతికి అంకితం చేస్తారు. అలాగే మహబూబ్నగర్ జిల్లాలో రూ.3,175 కోట్ల వ్యయంతో చేపట్టనున్న జాతీయ రహదారి పనులకు వర్చువల్గా శ్రీకారం చుడతారు. కాజీపేట-విజయవాడ మధ్య మూడో రైల్వే లైన్ ప్రారంభించడంతో పాటు, హఫీజ్పేట, జోగులాంబ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను ప్రధాని ప్రారంభిస్తారు.
Telangana railway projects | ఎంఎంటీఎస్ రెండో దశ పనుల వేగం
తెలంగాణలో ప్రస్తుతం రూ.85 వేల కోట్ల విలువైన రైల్వే పనులు వివిధ దశల్లో ఉన్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ – యాదగిరిగుట్ట మధ్య ఎంఎంటీఎస్ (MMTS) రెండో దశ పనులు ఇప్పటికే వేగం పుంజుకున్నాయని తెలిపారు. వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అభివృద్ధిని కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని, 2030 నాటికి దేశం నుంచి రూ.9 లక్షల కోట్ల విలువైన వస్త్ర ఎగుమతులే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన వివరించారు.
దీనిని కూడా చదవండి : FBO Caught by ACB | పోడు భూమి కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్

