అక్షరటుడే వెబ్డెస్క్: Venkaiah Naidu Free Schemes |నెల్లూరు జిల్లా ( Nellore )వింజమూరులోని వైఆర్ జూనియర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూనే, రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత పథకాలపై తన స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఉదయగిరి ప్రాంత ప్రజలు తనను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని వెంకయ్య నాయుడు గుర్తుచేసుకున్నారు. ఈ ప్రాంత ప్రజల ఆశీస్సులే తనను ఉదయగిరి నుంచి ఉపరాష్ట్రపతి స్థాయి వరకు తీసుకెళ్లాయని, తన ఎదుగుదలలో స్థానిక ప్రజల పాత్ర ఎంతో కీలకమని ఆయన భావోద్వేగంతో పేర్కొన్నారు.
Venkaiah Naidu Free Schemes | ఉచిత పథకాలపై వ్యతిరేకత..
రాష్ట్రంలో అమలు చేస్తున్న ఉచిత పథకాలకు తాను వ్యతిరేకమని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత బస్సు వంటి పథకాల వల్ల ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారం పడే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం అయినా, గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలైనా ఉచిత పథకాలను నిలిపివేయాలని అభిప్రాయపడ్డారు. అయితే ప్రజలకు ఉచితంగా అందించాల్సింది కేవలం నగదు లేదా వస్తువులు కాదని, నాణ్యమైన విద్య, వైద్యం, ఆరోగ్యం వంటి ప్రాథమిక సదుపాయాలని ఆయన పేర్కొన్నారు. పేదలకు మాత్రమే అవసరమైన సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వాలు విధానాలు రూపొందించాలని సూచించారు. ప్రజలకు మంచి విద్య, వైద్యం అందితే వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు.
Venkaiah Naidu Free Schemes | దేశ అభివృద్ధిపై ప్రశంసలు..
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ దేశాలకు దీటుగా అభివృద్ధి బాటలో ముందుకు సాగుతోందని వెంకయ్య నాయుడు అన్నారు. దేశ ఆర్థిక, మౌలిక రంగాల్లో పురోగతి సాధిస్తూ అంతర్జాతీయ స్థాయిలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోందని ఆయన కొనియాడారు.
ఇది కూడా చదవండి: Kaleshwaram Project | కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రచారం పటాపంచలైంది: హరీశ్ రావు