అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Bribery Case | ఓ రికార్డు అసిస్టెంట్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఈ ఘటన హైదరాబాద్ (Hyderabad) నగరంలోని అమీర్పేటలో చోటు చేసుకుంది.
అమీర్పేటోని డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ కార్యాలయంలో ఎస్. శివానంద్ రికార్డు అసిస్టెంట్గా పని చేస్తున్నాడు. ఓ వ్యక్తి తన తల్లి పెన్షన్ ప్రయోజనాల కోసం కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. ఆ దరఖాస్తును ప్రాసెస్ చేసి, ఉన్నతాధికారులకు పంపించడానికి, రిటైర్మెంట్ బెన్ఫిట్స్ అందించడానికి రికార్డు అసిస్టెంట్ శివానంద్ (Record Assistant Shivanand) రూ.20 వేల లంచం డిమాండ్ చేశాడు.
ACB Bribery Case | వల పన్ని..
అధికారి లంచం అడగటంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. ఈ మేరకు సోమవారం ఫిర్యాదుదారుడి నుంచి రూ.20 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ (ACB) అధికారులు సీనియర్ అసిస్టెంట్ శివానంద్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
ACB Bribery Case | అవినీతి రాజ్యం
రాష్ట్రంలో అవినీతి రాజ్యం ఏలుతోంది. అన్ని కార్యాలయాల్లో అవినీతి అధికారులు తిష్ట వేశారు. సామాన్య ప్రజల నుంచి మొదలు పెడితే కాంట్రక్టర్ల వరకు ఎవరిని వదలడం లేదు. అందరిని డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఆఖరకు తమ శాఖలో పని చేసి విరమణ పొందిన ఉద్యోగులకు బెన్ఫిట్స్ అందించడానికి కూడా డబ్బులు అడుగుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బిల్లుల చెల్లింపుల కోసం సైతం ట్రెజరీ శాఖలో అధికారులు కమీషన్లు వసూలు చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. అయినా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టడం లేదు. లంచాలు తీసుకుంటున్న అధికారులు భారీగా అక్రమాస్తులు కూడబెడుతున్నారు.
ACB Bribery Case | కఠిన చర్యలు కరువు
రాష్ట్రంలో ఇటీవల ఏసీబీ దూకుడు పెంచింది. అవినీతి అధికారుల భరతం పడుతోంది. వల పన్ని వారిని పట్టుకుంటుంది. అయితే ఆ తర్వాత కేసు విచారణ వేగంగా సాగడం లేదు. ఏళ్ల తరబడి విచారణ సాగడం, నిందితులకు శిక్ష పడకపోవడంతో ఏసీబీ కేసులు నీరు గారిపోతున్నాయి. ఫలితంగా లంచాలు తీసుకోవడానికి అధికారులు భయపడటంలేదు. ఒకవేళ దొరికినా కొన్ని నెలలు సస్పెండ్ అయి మళ్లీ ఉద్యోగంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏసీబీ కేసుల్లో దొరికిన కొందరు తర్వాత ప్రమోషన్లు పొందిన ఘటనలు ఉన్నాయి. మరికొందరు ఒకటి కంటే ఎక్కువ సార్లు లంచాలు తీసుకుంటూ దొరికారు. వీరిపై కఠిన చర్యలు కరువు అయ్యాయి. ఇలాంటి వారిని ఉద్యోగంలో నుంచి పూర్తిగా తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. అంతేగాకుంగా అక్రమంగా కూడబెట్టిన ఆస్తులను స్వాధీనం చేసుకొని జైలుశిక్ష విధించేలా చట్టాలు తీసుకు రావాలని వేడుకుంటున్నారు.
దీనిని కూడా చదవండి : DEE caught by ACB | ‘డబుల్’ ఇళ్ల బిల్లుల కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన డీఈఈ


