అక్షరటుడే, కామారెడ్డి: Mahesh Kumar Goud | తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయిందని, బీజేపీ (BJP) వచ్చే అవకాశమే లేదని టీపీసీసీ అధ్యక్షుడు (TPCC chief) బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. కామారెడ్డి (Kamareddy) పట్టణంలోని క్రిస్టల్ ప్యాలెస్లో మంగళవారం డీసీసీ నూతన కమిటీ ప్రమాణస్వీకారం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నూతనంగా నియమించబడిన కమిటీ సభ్యులకు, కాంగ్రెస్ మండల అధ్యక్షులకు నియామకపత్రాలు అందజేసి వారితో ప్రమాణస్వీకారం చేయించారు.
Mahesh Kumar Goud | ఏ చిన్న పదవి అయినా భవిష్యత్తుకు పునాది..
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో ఏచిన్న పదవి అయినా అది భవిష్యత్తుకు పునాది అని.. ఆ పదవికి న్యాయం చేస్తేనే భవిష్యత్తు ఉంటుందని పీసీసీ చీఫ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలకు న్యాయం చేకూరుతుందని తెలిపారు. ఉచిత బస్సు నుంచి మొదలుకుని సన్నబియ్యం పంపిణీ వరకు తెలంగాణ పథకాలు ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విజన్తో రాష్ట్రానికి రూ.6 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా కులగణన చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, యావత్ దేశానికి తెలంగాణ రోల్ మోడల్ అని తెలిపారు. కులగణనలో బీసీలను చేర్చవద్దన్న మోదీకి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. వరి వేస్తే ఉరే అని చెప్పిన విషయాన్ని బీఆర్ఎస్ మర్చిపోయిందన్నారు. కల్లాల మీద రైతులు చనిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవలం 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొంటామని అంటోందని, 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

Mahesh Kumar Goud | రెండున్నరేళ్లలోనే 80వేల ఉద్యోగాలు..
గత పదేళ్లలో 50వేల ఉద్యోగాలిస్తే కేవలం రెండున్నరేళ్లలో 80 వేల ఉద్యోగాలిచ్చామని బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలు ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. పీహెచ్సీ నుంచి గాంధీ, నిమ్స్ ఆస్పత్రి వరకు ప్రక్షాళన చేసి పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు పేర్కొన్నారు. విద్య, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వెళ్తూ రూ.8 లక్షల కోట్ల అప్పు చూపినా పథకాలు, అభివృద్ధి ఆపడం లేదని స్పష్టం చేశారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో పేదవాడికి న్యాయం చేయలేని స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందన్నారు. కేవలం బడా వ్యాపారుల సంక్షేమం కోసమే కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందని ఆరోపించారు. ఉమ్మడి జిల్లాలో 2 పార్లమెంట్, 9 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని పూర్వ వైభవం తీసుకువస్తామని, దాని కోసం నూతన కమిటీ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జుక్కల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు తోట లక్ష్మీకాంత్ రావు, మదన్ మోహన్ రావు, కామారెడ్డి, నిజామాబాద్ డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, నగేష్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్లు ఇప్ప ఉమారాణి, పబ్బ శ్రీకాంత్, సీమా షెట్కార్, తదితర నాయకులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: OPPO Find X9 Ultra 5 G | అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి ఒప్పో ఫోన్


