అక్షరటుడే, బాల్కొండ : Vemula Prashanth Reddy | తెలంగాణ అస్తిత్వాన్ని కనుమరుగు చేయడానికి కొన్ని శక్తులు మళ్లీ కుట్రలు పన్నుతున్నాయని బాల్కొండ ఎమ్మెల్యే (Balkonda MLA) వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బాల్కొండలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన జాతీయ పతాకం ఎగుర వేశారు.
వేముల మాట్లాడుతూ.. కేసీఆర్ 14 పోరాటం చేసి తెలంగాణ సాధించారన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ (KCR) పదేళ్ల పాలనలో ఊహించని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని కొనియాడారు. తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు బక్కని నర్సింలు ఆంధ్రాకు వెళ్లి చంద్రబాబు ముందర “డిక్షనరీలోనే తెలంగాణ అనే పదమే లేదు” అని మాట్లాడటంపై వేముల తీవ్రంగా ధ్వజమెత్తారు. “తెలంగాణోడై ఉండి, ఇక్కడి పార్టీకి అధ్యక్షుడై ఉండి తెలంగాణ పదం లేదు అంటుంటే.. ఇక్కడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎందుకు ఖండించలేదు?” అని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సైతం ఆ నాయకులను ఎందుకు నిలదీయడం లేదని అడిగారు.
Vemula Prashanth Reddy | కేసీఆర్ లేకపోవడంతో..

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కోనసీమలో కొబ్బరికాయలు ఎండిపోతుంటే తెలంగాణోళ్ల దిష్టి తగిలింది అని వెటకారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలైన పులి కేసీఆర్ ఇవాళ అధికారంలో లేకపోవడంతో వీళ్లందరికీ ధైర్యం వచ్చి కుక్కలలా మొరుగుతున్నారని దుయ్యబట్టారు. టీడీపీలో ఉన్న సమయంలో సోనియా గాంధీని బలి దేవత అన్న రేవంత్రెడ్డి ఇప్పుడు ఆమె తెలంగాణ ఇచ్చిందని అంటున్నారని విమర్శించారు. ఇవాళ అధికారంలో ఉన్న పెద్దలకు తెలంగాణ ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేదని, అందుకే వారికి తెలంగాణపై సోయి లేదన్నారు. నరేంద్ర మోదీ, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్.. వీరంతా ఒకటై తెలంగాణ ఉనికినే లేకుండా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
Vemula Prashanth Reddy | జాగ్రత్తగా ఉండాలి
మనమందరం చాలా జాగ్రత్తగా, కమిట్మెంట్తో వ్యవహరించవలసిన సమయం వచ్చిందని వేముల అన్నారు. తెలంగాణ ఉనికి ప్రశ్నార్థకం అవుతున్న వేళ, ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలన్నారు. మరో ఉద్యమానికి సిద్ధం కావాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు.

దీనిని కూడా చదవండి: Sun stroke | వడదెబ్బతో మహిళ మృతి


