అక్షరటుడే, కామారెడ్డి: RTC Bus Protest | రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. బస్సులను కదలనిచ్చేది లేదని ఆయా జిల్లాల్లో కార్మికులు భీష్మించుకుని కూర్చున్నారు. కామారెడ్డి (Kamareddy) పట్టణంలో ఆర్డీవో ఆధ్వర్యంలో బస్సులు డిపో నుంచి బయటకు వచ్చాయి.
RTC Bus Protest | డిపో మేనేజర్ సహకారంతో..
పట్టణంలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతుండగా ఆర్డీవో ఎన్వై గిరి కార్మికులతో మాట్లాడి సమ్మె విరమించాలని సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. దాంతో డిపో మేనేజర్తో మాట్లాడి పోలీసు బందోబస్తు మధ్య ప్రైవేట్ డ్రైవర్ను ఏర్పాటు చేసి నిజాంసాగర్ బస్సును డిపో నుంచి బయటకు తీసుకువచ్చారు. బస్టాండ్ నుంచి బస్సు బయటకు వెళ్లే దారిలో కార్మికులు అడ్డుగా ఉండడంతో లోపలికి వెళ్లే దారి నుంచి బయటకు తేవడానికి పోలీసులు, అధికారులు ఏర్పాట్లు చేశారు.
RTC Bus Protest | పోలీసుల భద్రత మధ్య..
ఆర్డీవో, డిపో మేనేజర్, సీఐ ప్రైవేట్ డ్రైవర్కు నచ్చజెప్పి పోలీసు సిబ్బందిని ఎక్కించి బందోబస్తు మధ్య బస్సును బయటకు తీసుకొచ్చారు. దీంతో ఆర్టీసీ కార్మికులు (RTC Workers) బస్సును అడ్డుకుని భైఠాయించారు. దాంతో ఆర్డీవో మరోసారి కార్మికులతో మాట్లాడారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. సమ్మెను ఆపేయాలని తాము చెప్పడం లేదని, రెండు మూడు బస్సులు ఇక్కడినుంచి బయలుదేరితే ప్రజల ఇబ్బందులు తొలగుతాయని నచ్చజెప్పడంతో కేవలం రెండు బస్సులు మాత్రమే బయటకు వెళ్లేందుకు ఒప్పుకున్నారు. రెండు బస్సులు వెళ్లిన తర్వాత మరో నాలుగు బస్సులను బయటకు పంపడానికి సిద్ధంగా ఉంచగా కార్మికులు రెండువైపులా బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుగా నిలిచారు.

ఇది కూడా చదవండి..: RTC Strike Nizamabad | నిజామాబాద్లో ప్రశాంతంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

