అక్షరటుడే, వెబ్డెస్క్: RTC Bus Theft | ఓ వ్యక్తి మద్యం మత్తులో ఏకంగా ఆర్టీసీ బస్సును చోరీ చేశాడు. ఈ ఘటన జనగామ జిల్లా (Jangaon District) కేంద్రంలో చోటు చేసుకుంది.
జనగామ బస్టాండ్లో నిలిపి ఉంచిన ఆర్టీసీ అద్దె బస్సును పాలకుర్తికి చెందిన వెంకన్న అనే వ్యక్తి మద్యం మత్తులో దొంగిలించాడు. బస్సును స్టార్ట్ చేసి సూర్యాపేట వైపు సుమారు 21 కిలోమీటర్లు వేగంగా వెళ్లాడు. సింగరాజుపల్లి టోల్ గేట్ వద్దకు రాగానే బస్సు అదుపు తప్పి సిమెంట్ దిమ్మెను బలంగా ఢీకొని ఆగిపోయింది. దీంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు బస్సును స్వాధీనం చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
RTC Bus Theft | దొంగకు దేహశుద్ధి
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం మారుతినగర్లో గురువారం అర్ధరాత్రి దొంగలు తీవ్ర కలకలం సృష్టించారు. ఇద్దరు దొంగలు ఓ ఇంట్లోకి చొరబడి చోరీకి యత్నించారు. అయితే వారి అలికిడికి స్థానికులు లేచి అప్రమత్తం అయ్యారు. ఒకరిని చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మరొక దొంగ తప్పించుకొని పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Telangana Heat Increase | నేటి నుంచి పెరగనున్న ఎండలు