అక్షరటుడే, కామారెడ్డి: Hostel Students | ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థుల ఆత్మహత్యాయత్నం ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. బాన్సువాడలో(Banswada) ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మర్చిపోకముందే మరో ఘటన వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.
Hostel Students | సదాశివనగర్లో..
సదాశివనగర్(Sadashiv nagar) మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంలో (BC Hostel) పదో తరగతి చదువుతున్న విద్యార్థి గురువారం రాత్రి పుస్తకాలు, ఇతర వస్తువులకు ఉపయోగించే రబ్బర్ బ్యాండ్లతో మెడకు బలంగా చుట్టుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన హాస్టల్ వార్డెన్ విద్యార్థి ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకుని వెంటనే కామారెడ్డి జీజీహెచ్కు తరలించారు. విషయాన్ని ఉన్నతాధికారులకు, విద్యార్థి తల్లిదండ్రులకు చేరవేశారు. మొదట్లోనే ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. రబ్బర్ బ్యాండ్లతో గట్టిగా బిగుసుకుని ఊపిరాడకుంటే దారుణం జరిగి ఉండేది. వార్డెన్ అప్రమత్తతతో ప్రమాదం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గాంధారి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి మేనత్త ఇటీవల మృతి చెందడంతో మొన్నటి వరకు అక్కడే ఉన్నాడు. రెండు రోజుల క్రితమే తండ్రి ఆ విద్యార్థిని హాస్టల్లో విడిచిపెట్టి బాగా చదువుకోవాలని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. రాత్రి హాస్టల్ వార్డెన్ నుంచి ఫోన్ రాగానే వెంటనే ఆస్పత్రికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు.
Hostel Students | ఒంటరిగా ఉంటూ..
విద్యార్థికి హాస్టల్లో ఒంటరిగా ఫీలవుతూ, వసతిగృహంలో ఉండటం ఇష్టం లేకనే ఇలాంటి ఘటనకు పాల్పడినట్టు విద్యార్థి, అతని తల్లిదండ్రులు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. అయితే జిల్లాలో వరుస ఘటనలు మాత్రం కలకలం రేపుతున్నాయి. పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు కూడా కాకముందే వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వేసవి సెలవుల్లో ఇళ్ల వద్ద హుషారుగా ఉన్న విద్యార్థులు హాస్టళ్లకు రాగానే ఒత్తిడిగి గురవుతున్నారు.
హాస్టల్లో ఉండటం ఇష్టం లేని విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పినా వినిపించుకోకపోవడం వల్ల, తమను ఇక్కడే ఉంచేస్తారేమోనన్న ఆలోచనతో క్షణికావేశానికి గురై ఆత్మహత్య బాట పడుతున్నారు. ఈ క్రమంలో హాస్టల్లో ఇలా ఒంటరిగా ఫీలవుతూ హోమ్ సిక్తో బాధపడుతున్న విద్యార్థులను గుర్తించి వారికి సరైన కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి: విశాఖలో రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన