అక్షరటుడే వెబ్డెస్క్: KTR Comments | తెలంగాణ రాజకీయాల్లో నేతల వరుస పార్టీ మార్పులు, ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్టీ కార్యక్రమం కోసం తెలంగాణ భవన్కు వచ్చిన కేటీఆర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి , మల్లారెడ్డిల పార్టీ మార్పు అంశాలను ప్రస్తావిస్తూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
KTR Comments | కేటీఆర్ విమర్శలు..
కాంగ్రెస్ పార్టీని ‘మునిగే పడవ’గా అభివర్ణించిన కేటీఆర్, తెలిసి తెలిసి ఆ పడవను ఎవరైనా ఎక్కుతారా? అని ప్రశ్నించారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ( Pocharam Srinivas Reddy ) తీరును తప్పుబడుతూ, “నేను కాంగ్రెస్లోనే పుట్టానని డైలాగులు కొడుతూ, ఇప్పుడు మునిగిపోతున్న పార్టీలో చేరి కుడితిలో పడ్డ ఎలుకలా గిలగిలా కొట్టుకుంటున్నారు” అని ఎద్దేవా చేశారు. పోచారంతో పాటు అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్న మల్లారెడ్డి పార్టీ మార్పుపై కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోందని, వీరు కాంగ్రెస్ వైపు అడుగులు వేయడం ఆ పార్టీకే నష్టమని వ్యాఖ్యానించారు.
KTR Comments | రేవంత్ పాలనపై ఆగ్రహం..
యాదాద్రి సాక్షిగా కేసీఆర్తోనే ఉంటానని ప్రమాణం చేసిన పోచారం, మాట తప్పారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి బాటలోనే ఆయన కూడా దేవుడి మీద ఒట్లు వేసి మోసం చేస్తున్నారని, ఒక పెద్ద మనిషిగా ఉండి తాను ఏ పార్టీలో ఉన్నానో చెప్పుకోలేని స్థితికి ఆయన చేరుకున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలన చేతకాక, కేవలం తిట్లు, ఒట్లు మాత్రమే వచ్చని, ఈ రెండేళ్లలో ఆయన సాధించింది ఏమీ లేదని దుయ్యబట్టారు.
KTR Comments | ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్ లో..
ప్రభుత్వ పనితీరుపై కేటీఆర్ సంచలన విమర్శలు చేశారు.. రాష్ట్రంలో రిజర్వాయర్లు డెడ్ స్టోరేజీకి చేరుకున్నా, ప్రభుత్వం మాత్రం ‘కోల్డ్ స్టోరేజ్’లో నిద్రపోతోందని విమర్శించారు. ఎల్ నినో (El Nino) ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు ఆర్నెళ్ల క్రితమే హెచ్చరించినా, కరువు పరిస్థితులపై ఇన్నాళ్లకు ముఖ్యమంత్రికి మీటింగ్ పెట్టడం గుర్తుకొచ్చిందని, ఇది ప్రణాళికా లోపానికి నిదర్శనమని మండిపడ్డారు. మార్కెట్లలో ఎరువులు అందుబాటులో లేని పరిస్థితిలో, యాప్లో యూరియా ఎక్కడి నుంచి వస్తుందని ప్రభుత్వాన్ని నిలదీశారు. కాంగ్రెస్ నేతలు ఎన్నికల ముందు చెప్పే కల్లిబొల్లి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Vamsi Goud | బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా రత్నగారి వంశీ గౌడ్