అక్షరటుడే, వెబ్డెస్క్ : Indiramma Houses | రాష్ట్రంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎంతో మంది పేదలు ఎదురు చూస్తున్నారు. జూన్ 2న లబ్ధిదారుల జాబితా ప్రకటిస్తామని గతంలో మంత్రులు ప్రకటించారు. అయితే ఇంతవరకు దాని గురించి మాట్లాడటం లేదు. అయితే పది రోజుల్లో రెండో విడత ఇళ్లను మంజూరు చేస్తారని సమాచారం.
తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలివిడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేశారు. దీంతో చాలా మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టారు. పలువురి నిర్మాణాలు పూర్తి కావడంతో గృహ ప్రవేశాలు కూడా చేశారు. ఇల్లు కట్టుకున్న వారికి ప్రభుత్వం వేగంగా నిధులను విడుదల చేస్తోంది. విడతల వారీగా రూ.5 లక్ష సాయం అందజేస్తోంది. దీంతో రెండో విడత కోసం ఎంతోమంది పేదలు నిరీక్షిస్తున్నారు.
Indiramma Houses | పేదల ఆశలు
రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కోసం పేదలు నిరీక్షిస్తున్నారు. సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న వారు జాబితాలో తమ పేరు వస్తే ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నారు. కాగా ఆయా గ్రామాల నుంచి ఇందిరమ్మ కమిటీలు ఇప్పటికే ప్రభుత్వానికి అర్హుల జాబితాను పంపించాయి. ప్రభుత్వం నుంచి ఆమోదం వస్తే అందులో నిజమైన పేదలకు అధికారులు ఇళ్లు మంజూరు చేయనున్నారు. రెండో విడతలో 2.50 లక్షల ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే పూరి గుడిసెల్లో నివసిస్తున్న వారికే తొలి ప్రాధాన్యం ఇవ్వనుంది. రాష్ట్రంలో మొత్తం 83 వేల కుటుంబాలు గుడిసెల్లో నివాసం ఉంటున్నాయని, వాటిలో 43 వేల కుటుంబాలు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లకు అర్హులుగా గుర్తించారు.
Indiramma Houses | పూర్తికాని ఇళ్ల పనులు
మొదటి విడతలో ఇళ్లు మంజూరైన వారిలో కొంతమంది అసలు పనులు మొదలు పెట్టలేదు. చాలా ఇళ్లు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. కొన్ని బేస్మెంట్, స్లాబ్ లెవల్లో ఆగిపోయాయి. కొంతమంది అసలు మార్కింగ్ కూడా చేయలేదు. ఇల్లు మంజూరైనా.. పనులు మొదలు పెట్టనివారి స్థానంలో కొత్తవారికి ఇవ్వాలని గతంలో ప్రభుత్వం ఆదేశించింది. అయినా అధికారులు చర్యలు తీసుకోలేదు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పర్యవేక్షించాలని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో అధికారులు పట్టించుకోవడం లేదు.
ఇది కూడా చదవండి..: Telangana Rain Forecast | రైతులకు అలర్ట్.. తగ్గనున్న వర్షాలు