అక్షరటుడే, బాల్కొండ(మెండోరా): Sriram Sagar Project | ఎస్సారెస్పీలో ఇసుక పూడికపై కేంద్రంతో చర్చిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఎల్లంపల్లి, మేడిగడ్డ, అన్నారం సుందిళ్ల ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి దురుద్దేశం లేదని ఆయన పేర్కొన్నారు. మెండోరా మండలం (Mendora Mandal)లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టును మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, వివేక్తో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
Sriram Sagar Project | బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం
ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో ప్రస్తుతం నీటినిల్వలను స్వయంగా పరిశీలించేందుకు వచ్చామని.. వీటి ఆధారంగా రాష్ట్రంలో రైతాంగానికి సాగుకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్ టెక్నికల్ ఓవర్సీస్ కమిటీ సూచనల మేరకు ప్రాజెక్టుల పునరుద్ధరణ పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులపై చేపడుతున్న విధానాలపై బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ఈ ఏడాది కూడా మేడిగడ్డ, అన్నారం సుందిళ్ల బ్యారేజీలు.. వాటి పంప్హౌస్లు ఉపయోగించకుండానే వర్షం కారణంగా ఎల్లంపల్లి రిజర్వాయర్ 20టీఎంసీలు నిండడం జరిగిందన్నారు. కానీ తాము ప్రాజెక్టులపై తప్పులు చేస్తున్నట్లుగా బీఆర్ఎస్ ప్రచారం చేస్తోందని విమర్శించారు. శుక్రవారం ఢిల్లీలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్ టెక్నికల్ ఓవర్సీస్ కమిటీ కూర్చుని తెలంగాణలో ప్రాజెక్టులపై తీసుకుంటున్న నిర్ణయాలను సమర్థించాయన్నారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన ఎస్సారెస్పీ, నాగార్జున సాగర్, శ్రీశైలం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంటే.. 2019లో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు 2026లో కూలిపోయిందన్నారు.
Sriram Sagar Project | 56ఏళ్లుగా ఎస్సారెస్పీ సేవలు..
1970 నుంచి ఎస్సారెస్పీ పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభించిందని.. అప్పటినుంచి ఈరోజు వరకు 56ఏళ్లుగా నిరంతరాయంగా ఎస్సారెస్పీ ప్రజలకు సేవలందిస్తోందన్నారు. అయితే 112 టీఎంసీలతో కెపాసిటీతో నిర్మించిన ఈ రిజర్వాయర్ ప్రస్తుతం ఇసుక చేరడం కారణంగా 80 టీఎంసీల స్టోరేజీకి పడిపోయిందని తెలిపారు. తిరిగి పూర్తిస్థాయి స్టోరేజీకి ప్రాజెక్టును మలిచేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని.. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది శ్రీరాంసాగర్లో నీళ్లు తక్కువగా 22 టీఎంసీలు మాత్రమే ఉన్నాయన్నారు. ఈ నీటిని భవిష్యత్తు సాగు అవసరాలకు ఎలా వినియోగించుకోవాలనే విషయంపై త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఇన్ఛార్జి కలెక్టర్ భావేష్, డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్బిన్ హందాన్, కాంగ్రెస్నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Nizamabad Oora Panduga | ఊరంతా మెచ్చే ‘ఊర పండుగ’కు సర్వంసిద్ధం..