అక్షరటుడే, వెబ్డెస్క్: Telangana Flagship Programmes | రాష్ట్ర ప్రభుత్వ ఫ్లాగ్షిప్ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలంటే అన్ని ప్రభుత్వ శాఖల మధ్య బలమైన సమన్వయం అవసరమని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పేర్కొన్నారు. వివిధ శాఖల కార్యదర్శులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
Telangana Flagship Programmes | సమగ్ర డ్యాష్బోర్డ్ రూపకల్పన
ప్రభుత్వంలోని కీలక పథకాల లక్ష్యాలు, పురోగతి, అమలు స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా సమగ్ర డ్యాష్బోర్డ్ను ప్రభుత్వం రూపొందిస్తున్నట్లు తెలిపారు. అలాగే పథకాల అమలును నిశితంగా పర్యవేక్షించి లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా స్పీడ్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
త్వరలో ముఖ్యమంత్రి అన్ని శాఖల కార్యదర్శులతో సమగ్ర సమీక్ష నిర్వహించనున్నట్లు సీఎస్ తెలిపారు. ఫ్లాగ్షిప్ పథకాల అమలు, శాఖల పనితీరు, సాధించిన విజయాలు, భవిష్యత్ లక్ష్యాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్ర ప్రాయోజిత పథకాల పురోగతిపై ఈ సమావేశంలో సమీక్ష ఉంటుందని చెప్పారు.
ఇందుకు సంబంధించి అన్ని శాఖలు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని, వినూత్న కార్యక్రమాలు, ఉత్తమ విధానాలు, విజయగాథలతో కూడిన నివేదికలను సిద్ధం చేయాలని ఆదేశించారు.
Telangana Flagship Programmes | టీ-ఫైబర్ కనెక్టివిటీ విస్తరణకు చర్యలు..
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలతో సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు టీ-ఫైబర్ కనెక్టివిటీ విస్తరించాలని సీఎస్ సూచించారు. డిజిటల్ పాలనను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ విజన్-2047 లక్ష్యాలకు అనుగుణంగా శాఖలు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల విడుదలలో జాప్యం తలెత్తకుండా యుటిలైజేషన్ సర్టిఫికెట్లు, ప్రాజెక్టు ప్రతిపాదనలు, తప్పనిసరి నివేదికలను సకాలంలో సమర్పించాలని అధికారులను సీఎస్ ఆదేశించారు.
Telangana Flagship Programmes | 14 నుంచి ఖేలో ఇండియా..
రాష్ట్రంలో నవంబరు 14 నుంచి ప్రారంభం కానున్న ఖేలో ఇండియా గేమ్స్ ఏర్పాట్లపై కూడా సమావేశంలో సమీక్ష నిర్వహించారు. ఈ క్రీడా మహోత్సవం విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన కమిటీలను ముందుగానే ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ పోటీల్లో 7 వేల మందికి పైగా క్రీడాకారులు, కోచ్లు, అధికారులు పాల్గొననున్నట్లు, రాష్ట్రంలోని 11 వేదికల్లో 26 క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నట్లు తెలిపారు.
కోర్ అర్బన్ రీజియన్లో వాహన కాలుష్యాన్ని తగ్గించాలన్న ముఖ్యమంత్రి లక్ష్యానికి అనుగుణంగా డీజిల్ ఆటోరిక్షాలను ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ వ్యవస్థతో రీట్రోఫిట్ చేసే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సీఎస్ ఆదేశించారు.
ప్రస్తుత సీజన్లో ఎల్నినో ప్రభావంతో వరి సాగుకు నీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంటూ, రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై విస్తృత అవగాహన కల్పించి పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహించాలని అధికారులకు సీఎస్ సూచించారు.