అక్షరటుడే, నందిపేట: Cyber Fraud | స్మార్ట్ఫోన్ smart phone పోగొట్టుకున్న ఓ వ్యక్తి నిర్లక్ష్యంతో సైబర్ కేటుగాళ్లు అతని బ్యాంకు ఖాతాను ఖాళీ చేశారు. ఫోన్ పోయిన పది రోజుల తర్వాత సిమ్ను మరో స్మార్ట్ఫోన్లో వేసి ఫోన్పే, గూగుల్పే యాప్లను యాక్టివేట్ చేయగా.. అప్పటికే ఖాతా నుంచి రూ.2,21,995 మాయమైనట్లు గుర్తించాడు. అప్రమత్తమైన బాధితుడు వెంటనే 1930కు ఫిర్యాదు చేయడంతో రూ.1,51,743ను హోల్డ్ చేయగలిగారు.
Cyber Fraud | గత నెలలో మొబైల్ పోగొట్టుకుని..
నిజామాబాద్ జిల్లా నందిపేట ఎస్సై వినయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నవీపేట మండలానికి చెందిన ఓ వ్యక్తి జులైలో నందిపేటలో తన స్మార్ట్ఫోన్ను పోగొట్టుకున్నాడు. వెంటనే కొత్త సిమ్ కార్డు తీసుకుని దాన్ని సాధారణ ఫోన్లో వినియోగించాడు.
సుమారు పది రోజుల తర్వాత అదే సిమ్ను మరో స్మార్ట్ఫోన్లో వేసుకుని ఫోన్పే, గూగుల్పేలను యాక్టివేట్ చేసుకునే సమయంలో తన బ్యాంకు ఖాతా నుంచి తనకు తెలియకుండానే రూ.2,21,995 డెబిట్ అయినట్లు గుర్తించాడు.
Action Against Scanning Centers | నిబంధనలు బేఖాతరు.. స్కానింగ్ సెంటర్లు, ఆస్పత్రులపై కొరడా
దీంతో వెంటనే సైబర్ క్రైమ్ టోల్ఫ్రీ నంబర్ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. సైబర్ నేరగాళ్లు బదిలీ చేసిన మొత్తంలో రూ.1,51,743ను హోల్డ్ చేయగలిగినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Cyber Fraud | తెలియని లింక్.. ఒక్క క్లిక్తో ముప్పు
ఈ ఘటన నేపథ్యంలో ఎస్సై వినయ్కుమార్ ప్రజలను అప్రమత్తం చేశారు. తెలియని నంబర్ల నుంచి మాత్రమే కాకుండా, తెలిసిన నంబర్ల నుంచి వచ్చినప్పటికీ కొత్తగా వచ్చే అనుమానాస్పద లింక్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని సూచించారు.
Rtochallan.apk, sbiloan.apk, pmkisanyojana.apk వంటి APK ఫైళ్లను డౌన్లోడ్, ఇన్స్టాల్ వంటివి చేయొద్దని హెచ్చరించారు. ఇలాంటి అనుమానాస్పద ఫైళ్లను ఓపెన్ చేయడం వల్ల మొబైల్లోని వ్యక్తిగత, బ్యాంకింగ్ సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉందన్నారు.
స్మార్ట్ఫోన్ పోగొట్టుకున్న వెంటనే సంబంధిత బ్యాంకు ఖాతాలు, యూపీఐ సేవలను తాత్కాలికంగా నిలిపివేసి, సిమ్ను బ్లాక్ చేయించుకోవడంతో పాటు 1930కు వెంటనే ఫిర్యాదు చేయాలని ఎస్సై సూచించారు. సైబర్ మోసంలో సమయం కీలకమని, ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే అంత మేరకు నగదును హోల్డ్ చేసే అవకాశం ఉంటుందని వివరించారు.