అక్షరటుడే, వెబ్డెస్క్: Telangana Global Summit | రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) బుధవారం భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు హాజరుకావాలని కోరారు.
భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. సదస్సులో భాగంగా నిర్వహించే రక్షణ ఎక్స్పో-2026ను ప్రారంభించాలని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను సీఎం కోరారు. అనంతరం పలు అంశాలపై కేంద్ర మంత్రితో ముఖ్యమంత్రి చర్చించారు. రక్షణ ఎక్స్పో లో ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాలకు సంబంధించిన ప్రత్యేక సదస్సుతో పాటు ప్రతిష్టాత్మక ఎయిర్షో, పారిశ్రామిక ప్రదర్శన, భూ రక్షణ వ్యవస్థల ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు.
Telangana Global Summit | సహకరించాలని విజ్ఞప్తి
రక్షణ ఎక్స్పో-2026ను అంతర్జాతీయ ప్రమాణాలతో విజయవంతంగా నిర్వహించేందుకు రక్షణ శాఖ సహకరించాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. ఎయిర్షో నిర్వహణకు అవసరమైన గగనతల అనుమతులు ఇవ్వడంతో పాటు భారత వైమానిక దళానికి చెందిన విమానాలు, సూర్యకిరణ్, సారంగ్ ఏరోబాటిక్ బృందాలు ప్రదర్శనలో పాల్గొనేలా సహకరించాలని కోరారు. హెచ్ఏఎల్, బీఈఎల్, బీడీఎల్, ఎండీఎల్ తదితర రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలు, డీఆర్డీవో ప్రయోగశాలలు రక్షణ ఎక్స్పోలో విస్తృతంగా పాల్గొని స్వదేశీ రక్షణ సాంకేతికతను ప్రదర్శించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.
Telangana Global Summit | భూ సేకరణ పూర్తి
ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 750 ఎకరాలు భూ సేకరణ చేపట్టిందని సీఎం వివరించారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో రక్షణ పరిశోధన, అభివృద్ధి ప్రయోగశాల (డీఆర్డీఎల్) ఆధ్వర్యంలో చేపట్టనున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు 416.18 ఎకరాల భూమిని కేటాయించేందుకు ఇప్పటికే టీజీఐఐసీ అంగీకరించిందని తెలియజేశారు. ఎకరానికి కాకుండా మొత్తం భూమికి సంవత్సరానికి కేవలం రూ.1 నామమాత్రపు లీజు అద్దెతో 33 సంవత్సరాల కాలానికి భూమిని కేటాయించనున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి..: Revanth Reddy 1000 Days | వెయ్యి రోజుల పాలనపై సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగ సందేశం