అక్షరటుడే, వెబ్డెస్క్ : Paddy Procurement | రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి (Minister Ponguleti) అన్నారు. అన్నదాతలు ఆందోళన చెందొద్దని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. లారీలు రాకపోవడంతో కాంటాలు సాగడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి గురువారం ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఖమ్మం (Khammam)) జిల్లా పాలేరులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం సేకరణ, మద్దతు ధర, తూకంలో పారదర్శకత, గోనె సంచుల లభ్యత, సేకరించిన ధాన్యం మిల్లులకు తరలింపు అమలుపై ఆరా తీశారు.
Paddy Procurement | చర్యలు తీసుకోవాలి
కొనుగోలు చేసిన ధాన్యాన్ని తక్షణమే మిల్లులకు తరలించేలా లారీల సంఖ్యను పెంచాలని మంత్రులు సూచించారు. ఎక్కడా సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లారీల కొరత, హమాలీల సమస్య ఉందని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ క్రమంలో ఇతర అవసరాల కోసం ఉపయోగించే లారీలు, డీసీఎంలను కొద్ది రోజులు ధాన్యం తరలింపునకు వాడాలన్నారు.
Paddy Procurement | ఆ మిల్లులను సీజ్ చేయండి
ధాన్యంలో తాలు ఉందని మిల్లర్లు సుమారు 5, 6 కేజీల వరకు కట్ చేస్తున్నారని రైతులు మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. అవసరం అయితే ఇలాంటి మిల్లులను సీజ్ చేయాలని మంత్రి ఆదేశించారు. లారీలు పంపడానికి కూడా బస్తాకు రూ.2 నుంచి రూ.5 వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. రైతులు ఆందోళన చెందొద్దని మంత్రులు కోరారు. చివరి గింజ వరకు మద్దతు ధరతో కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు.
దీనిని కూడా చదవండి : PMJ Jewellery Robbery|పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్


