అక్షరటుడే వెబ్డెస్క్:Telangana Farmers Protest|తెలంగాణలో రైతాంగం తీవ్ర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా.. ముఖ్యమంత్రికి మాత్రం వారి ఇబ్బందులు పట్టడం లేదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత (Kalvakuntla Kavitha)తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధాన్యం, జొన్నలు, పొద్దుతిరుగుడు వంటి పంటల కొనుగోళ్లు సక్రమంగా జరగకపోవడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలోనే రైతులకు న్యాయం చేయాలని, ప్రభుత్వంలో కదలిక తేవడానికే తాము సచివాలయం వద్ద నిరసన చేపట్టినట్లు ఆమె వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల వద్దే రైతులు ప్రాణాలు కోల్పోతుండటం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎలాంటి తరుగు తీయకుండా, తక్షణమే రైతుల నుంచి వడ్లు, జొన్నలు సేకరించాలని కవిత డిమాండ్ చేశారు. సచివాలయం ముందు వడ్లు పోసి నిరసన తెలిపితేనైనా ఈ ప్రభుత్వానికి కళ్లు తెరుచుకుంటాయనే ఉద్దేశంతోనే ధర్నాకు దిగినట్లు స్పష్టం చేశారు.
Telangana Farmers Protest | వ్యవసాయ శాఖపై సీఎంకు పట్టింపు లేదు..
గడిచిన రెండున్నరేళ్లుగా ముఖ్యమంత్రి కనీసం వ్యవసాయ శాఖపై ఒక్క సమీక్ష (రివ్యూ) కూడా నిర్వహించలేదని కవిత విమర్శించారు. జిల్లాల్లో కలెక్టర్ల తీరు వల్ల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. గ్రేడ్-ఏ రకం వరిని సైతం గ్రేడ్ లేనిదిగా నమోదు చేస్తున్నారని.. సన్నబియ్యానికి ఇవ్వాల్సిన బోనస్ను ఎగ్గొట్టేందుకే ప్రభుత్వం ఇలాంటి డ్రామాలకు తెరలేపిందని ఆరోపించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు యూరియా కోసం కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందని, ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త యాప్ ఎవరికీ అర్థం కావడం లేదని కవిత ఎద్దేవా చేశారు. అన్నదాతల కన్నీళ్లకు కారణమవుతున్న ప్రభుత్వం.. ఇకనైనా స్పందించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Indiramma Houses Progress | గరీబోళ్ల కోసం మాట్లాడడం కాంట్రవర్సీ అయితే రోజూ మాట్లడతా.. : ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు..


