అక్షరటుడే, వెబ్డెస్క్: A Mohan Corruption | ఒకప్పుడు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడుల్లో భారీ ఎత్తున అక్రమ ఆస్తులు బయటపడిన ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ అధికారి పేరు మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
అప్పట్లో దాదాపు రూ.800 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నప్పటికీ, కొన్నేళ్ల తర్వాత ఆయనకు పదోన్నతి లభించిందనే ప్రచారం నెట్టింట వైరల్ అవుతోంది.
A Mohan Corruption | డిప్యూటీ కమిషనర్గా..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టుల ప్రకారం.. ఆ అధికారి ఏ. మోహన్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖలో జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్నారు. 2016లో ఆయన డిప్యూటీ కమిషనర్గా ఉన్న సమయంలో ఏసీబీ దాడులు నిర్వహించి.. బంగారం, వెండి, వజ్రాలు, విలువైన రత్నాలు, భూములు, షెల్ కంపెనీలు సహా దాదాపు రూ.800 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
A Mohan Corruption | కింది సిబ్బంది నుంచే వసూళ్లు..
అప్పటి మీడియా కథనాల ప్రకారం.. ట్రక్కుల నుంచి అక్రమంగా వసూళ్ల రూపంలో భారీగా డబ్బు సంపాదించేవారని, నెలకు రూ. కోట్ల అక్రమ ఆదాయం సమకూరేదని ఆరోపణలు వచ్చాయి.
దీనికితోడు తన కింద పనిచేసే సిబ్బంది నుంచే డబ్బులు వసూలు చేసేవారని, ఆయన అరెస్టుతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారని అప్పట్లో కొన్ని పత్రికలు పేర్కొన్నాయి.
కానీ, ఈ కేసులో ఇప్పటివరకు ఆయనపై కోర్టు తీర్పు (దోషిగా నిర్ధారణ లేదా నిర్దోషిగా విముక్తి) వెలువడినట్లు లేదు. కాగా, ప్రస్తుతం ఆయన జాయింట్ కమిషనర్ హోదాలో కొనసాగుతున్నారనే అంశం సోషల్ మీడియాలో మళ్లీ చర్చకు దారి తీసింది.
Amit Bapna Arrest | రిలయన్స్ ఏడీఏ గ్రూప్ కేసులో కీలక పరిణామం.. మాజీ సీఎఫ్వో అమిత్ బాప్నా అరెస్టు
A Mohan Corruption | పదోన్నతిపై చర్చ..
కేసు తుది ఫలితం వెలువడకముందే పదోన్నతి లభించిందా? లేక సేవా నిబంధనల ప్రకారం పరిపాలనా ప్రక్రియలో భాగంగా ఆ పదోన్నతి కల్పించారా? అనే అంశాలపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్టుల నేపథ్యంలో.. అవినీతి కేసుల దర్యాప్తు, న్యాయపరమైన విచారణలు, పదోన్నతుల విధానంపై మరోసారి చర్చ మొదలైంది.