అక్షరటుడే, వెబ్డెస్క్: Anumula Brothers Allegations | రాష్ట్రంలో అనుముల సోదరుల దోపిడీ కొనసాగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సీఎం సోదరుడు కొండల్రెడ్డికి తుక్కుగూడలో ప్రభుత్వం కేటాయించిన భూమిని బీఆర్ఎస్ బృందం గురువారం పరిశీలించింది.
కేటీఆర్ (KTR) మాట్లాడుతూ.. పేదవారిని కొట్టాలి.. పెద్ద వాళ్లకు పెట్టాలి అన్నట్లు రాష్ట్రంలో పరిస్థితి ఉందన్నారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలిచ్చారని, ఒక్కటి కూడా నిలుపుకోలేదని విమర్శించారు. సీఎం భూ దోపిడీపై ప్రశ్నిస్తే తమను సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ తమ్ముడు పటాన్చెరులో ఓ కంపెనీ పెట్టుకున్నారని, అంత చిన్న కంపెనీకి ఇక్కడ భూములు ఇచ్చారన్నారు. కొండల్ రెడ్డి కంపెనీ టెసెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్కు రూ.200 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.7 కోట్లకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టబెట్టిందన్నారు.
Anumula Brothers Allegations | సోదరులతో ఒప్పందాలు చేసుకొని..
అమెరికా పర్యటనలో సొంత సోదరులతోనే ఒప్పందాలు చేసుకొని రేవంత్ రెడ్డి పెట్టుబడులు తెస్తున్నారని కేటీఆర్ అన్నారు. అనుముల జగదీశ్వర్ రెడ్డికి రూ.1000 కోట్లు, అనుముల కొండల్ రెడ్డికి రూ.250 కోట్లు ఇవ్వడమేనా ప్రజాపాలన అని ప్రశ్నించారు. అనుముల అన్నదమ్ముల దోపిడీ గురించి బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదన్నారు. ఇజ్రాయెల్తో ఒప్పందం చేసుకుంటే రాహుల్ గాంధీ మోదీని ప్రశ్నించారని, అదే రేవంత్ రెడ్డి ఇజ్రాయెల్తో ఒప్పందం చేసుకుంటే బీజేపీ ఎందుకు మౌనంగా ఉందన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూసి పొంగులేటి కూడా రాఘవ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అని స్టార్ట్ చేశారన్నారు. దోచుకున్న డబ్బులను దాచుకోవడానికి వారికి స్థలం సరిపోవడం లేదన్నారు.
Anumula Brothers Allegations | ఫ్యూచర్ సిటీ నిలవదు
ఫ్యూచర్ సిటీ అనేది మాయ అని, భవిష్యత్లో అది నిలవదని కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో ఫార్మా సిటీ పేరు మీద షరతులతో భూసేకరణ జరిగిందన్నారు. ఆ భూముల్లో వేరే సిటీలు పెడితే రద్దు అవుతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్యూచరే లేని సీఎం తన అన్నదమ్ముల కోసం ఆడుతున్న నాటకంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వారు బలిపశువులు కావొద్దని హితవు పలికారు. ఇక్కడ జరుగుతున్న రియల్ ఎస్టేట్ మాఫియాలో ఇరుక్కుంటే, తాము ప్రభుత్వంలోకి వచ్చాక మొట్టమొదట నష్టపోయేది వారే అన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఊరూరా సదస్సులు పెట్టి ఫ్యూచర్ సిటీ మాయ గురించి చెప్తామని తెలిపారు.
ఇది కూడా చదవండి..: RTC CCTV Cameras | ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలపై మంత్రి పొన్నం క్లారిటీ