అక్షరటుడే, బోధన్: Bodhan Government Hospital | పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడి పారిశుధ్యంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పారిశుధ్య కాంట్రాక్ట్ ఏజెన్సీకి షోకాజ్ నోటీస్ జారీ చేయాలని ఆదేశించారు.
Bodhan Government Hospital | అన్ని విభాగాలను క్షుణ్ణంగా తనిఖీ..
ఆస్పత్రిలోని అవుట్ పేషంట్ బ్లాక్, కాన్పుల విభాగం, ఇమ్యూనైజేషన్ గది, పోస్ట్ ఆపరేటివ్ వార్డ్ తదితర విభాగాలను కలెక్టర్ సందర్శించి అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. ఆస్పత్రి ఆవరణను, శిథిలావస్థకు చేరిన ఐసోలేషన్ వార్డు భవనాన్ని పరిశీలన జరిపారు. ఆస్పత్రి ఆవరణ.. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పారిశుధ్య కాంట్రాక్ట్ ఏజెన్సీకి షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. పరిస్థితిలో మార్పు రాకపోతే కాంట్రాక్టు రద్దు చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్పర్సన్ కవితారెడ్డితో కలిసి బోధన్ ఆర్డీవో విజయలక్ష్మి, జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త శ్రీనివాస్ ప్రసాద్, డీఎంహెచ్వో డాక్టర్ రాజశ్రీ, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్, ఇతర వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రి రికార్డులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన బ్యాంకు స్టేట్మెంట్లను నిశితంగా పరిశీలించారు.
Bodhan Government Hospital | ఆస్పత్రిలో సదుపాయాలపై..
ఆస్పత్రిలో నెలకొన్న ఇబ్బందుల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం నిధులు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. బాన్సువాడతో పాటు సరిహద్దు ప్రాంతాల నుంచి గర్భిణులు ఈ ఆస్పత్రికి సందర్శిస్తున్నారని, ప్రతినెలా సగటున 200 వరకు కాన్పులు జరుగుతున్నాయన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఆస్పత్రిలో బర్త్ వెయిటింగ్ రూం ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. మెడికో లీగల్ కేసులు కూడా ఎక్కువగానే వస్తున్నందున, భద్రతాపరమైన అంశాల రీత్యా బోధన్ ఆస్పత్రిలో పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటు చేయాల్సిందిగా జిల్లా పోలీసు శాఖకు ప్రతిపాదిస్తామని తెలిపారు.
Bodhan Government Hospital | వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత..

వైద్య రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరుపై నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్ సూచించారు. వైద్యులు, సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ రోగులకు నాణ్యమైన సేవలు అందించేలా అంకిత భావంతో విధులు నిర్వర్తించాలన్నారు. సీజనల్ వ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. అవసరమైన మౌలిక సదుపాయాలు, వైద్యులు, సిబ్బందిని కేటాయిస్తామని.. అయినా కూడా వైద్య సేవలలో లోపాలు ఉంటే ఉపేక్షించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. తాను క్రమం తప్పకుండా ఆకస్మిక తనిఖీలు జరుపుతానని, నిర్లక్ష్యానికి తావు కల్పిస్తే కఠినచర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. స్థానిక ఆర్డీవో నేతృత్వంలో ప్రతిపక్షం రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహించి, ఆస్పత్రి నిర్వహణ తీరుతెన్నులపై తనకు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో బోధన్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, తహశీల్దార్ విఠల్, స్థానిక వైద్యాధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Kamareddy Police Sports | రాష్ట్ర పోలీస్ క్రీడల్లో కామారెడ్డి పోలీసుల అద్భుత ప్రతిభ