Cheriyal Tahsildar Bribery | రూ.70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహశీల్దార్

సిద్దిపేట జిల్లా చేర్యాల తహశీల్దార్​ కొర్ర దిలీప్​ నాయక్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cheriyal Tahsildar Bribery | లంచం తీసుకుంటూ తహశీల్దార్​ దొరికిపోయాడు. నాలా కన్వర్షన్​ కోసం రూ.70 వేలు తీసుకుంటుండగా రెడ్​ హ్యాండెడ్​గా అధికారులు పట్టుకున్నారు.

సిద్దిపేట (Siddipet) జిల్లా చేర్యాల తహశీల్దార్​ కొర్ర దిలీప్​ నాయక్​ నాలా కన్వర్షన్ (NALA conversion)​ కోసం లంచం డిమాండ్​ చేశాడు. మండలంలోని నాగపురి గ్రామంలో జమున, కనకమ్మ ఇతరుల పేర్ల మీద 30 గుంటల విస్తీర్ణం గల సర్వే నంబర్లు 833/B, 833/C, 833/D, 833/E, 834/B, 834/C, 834/D, 834/E లకు సంబంధించిన 11 నాలా మార్పిడి దరఖాస్తులను ప్రాసెస్​ చేయడానికి రూ.70 వేలు అడిగాడు. ఇందులో ఇప్పటికే 8 ఇప్పటికే ప్రాసెస్ చేశారు. రూ.70 వేలు ఇస్తేనే మిగతావి చేస్తానని చెప్పాడు. దీంతో బాధితులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సోమవారం ఫిర్యాదుదారుల నుంచి రూ.70 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ (ACB) అధికారులు తహశీల్దార్​ దిలీప్​ నాయక్​ను రెడ్ హ్యాండెడ్​ పట్టుకున్నారు.

Cheriyal Tahsildar Bribery | అవినీతి కేంద్రాలుగా..

రాష్ట్రంలోని తహశీల్దార్​ కార్యాలయాలు అవినీతి కేంద్రాలుగా మారాయి. ప్రతి పనికి ఓ రేటు కడుతున్నారు. నిబంధనల ప్రకారం భూములు రిజిస్ట్రేషన్​ చేసుకున్నా.. ఆపరేటర్​కు కనీసం రూ.వెయ్యి ఇవ్వాల్సిందే. చివరకు ఫ్యామిలీ మెంబర్​ సర్టిఫికెట్ (FMC) కోసం కూడా లంచం అడుగుతున్నారు. ఆపరేటర్​ నుంచి మొదలు పెడితే ఆర్​ఐ (RI), తహశీల్దార్ వరకు లంచాలు తీసుకుంటున్నారు. పలువురు సర్వేయర్లు అయితే.. పైసలు ఇస్తేనే సర్వే చేయడానికి వస్తున్నారు. లేదంటే నెలల తరబడి దరఖాస్తును పెండింగ్​లో పెడుతున్నారు.

Cheriyal Tahsildar Bribery | డ్రైవర్లు, అటెండర్ల ద్వారా..

తహశీల్దార్​ కార్యాలయాల్లో అధికారులు ఎక్కువగా అటెండర్ల ద్వారా లంచాలు తీసుకుంటున్నారు. కొందరు అధికారులు నేరుగా వసూలు చేస్తున్నారు. పలువురు తహశీల్దార్లు నేరుగా తీసుకోకుండా తమ కారు డ్రైవర్ల ద్వారా దందా చేస్తున్నారు. తమ కుటుంబ సభ్యులు, బంధువులను కారు డ్రైవర్లుగా పెట్టుకొని లంచాలు తీసుకుంటున్న వారు ఉన్నారు. కొంత మంది అధికారులు కార్యాలయంలోని కొందరిని ఈ పని కోసం వాడుకుంటున్నారు. ఏసీబీ నిత్యం దాడులు చేస్తున్నా లంచాలకు మరిగిన అధికారులు భయపడటం లేదు. అవినీతి నిర్మూలనకు కఠిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

దీనిని కూడా చదవండి : Telangana Tourism | పురానాపూల్ బ్రిడ్జి ఇక పర్యాటక జోన్.. సీఎం రేవంత్ కీలక ప్రణాళిక

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *