అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Congress Party Posts | కష్టపడ్డ కార్యకర్తలకు పార్టీ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామని పీసీసీ చీఫ్ (PCC Chief) బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ (Congress Party) కార్యకర్తల సమావేశాన్ని నగరంలో ఆదివారం నిర్వహించారు.
Congress Party Posts | అన్ని వర్గాలను సమానంగా చూస్తాం..
ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కిందిస్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తలకు కూడా పదవులు ఇవ్వాలని డిమాండ్ వస్తోందని, పదవుల భర్తీలో అన్ని వర్గాలకు సమతుల్యత పాటిస్తామని చెప్పారు. 70 శాతం పదవులను పాత కార్యకర్తలకే ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జీలతో కలిసి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఏఐసీసీ స్థాయిలో అనుసరిస్తున్న విధానం కూడా ఇదే ఫార్మాట్లో ఉందన్నారు. గత ఐదేళ్లుగా పార్టీ కోసం నిరంతరం కష్టపడ్డ వారికి పదవుల్లో అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు.
Congress Party Posts | ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్..
ఎన్ఎస్యూఐ (NSUI), యూత్ కాంగ్రెస్తో పాటు పార్టీని అంటిపెట్టుకుని పనిచేస్తున్న కార్యకర్తలకు తొలి ప్రాధాన్యత ఇస్తామని పీసీసీ చీఫ్ తెలిపారు. అన్ని కమిటీలను భర్తీ చేస్తామని, ఇందులో 20 శాతం కొత్త వారికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. మార్కెట్ కమిటీలకు సంబంధించి అప్రూవల్ ఇవ్వాలని మంత్రి సీతక్క సూచించినట్లు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ‘అధికారం కార్యకర్తల కృషి వల్లే వచ్చింది. కార్యకర్తల కష్టాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మరిచిపోదు’ అని వ్యాఖ్యానించారు. ఇచ్చిన మాట ప్రకారం పీసీసీ అధ్యక్షుడిగా తన 35 ఏళ్ల కల అయిన ఇంజినీరింగ్ కళాశాల, వ్యవసాయ కళాశాలను సాధించుకున్నామన్నారు.
రాబోయే ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లతో తిరిగి అధికారంలోకి వస్తుందని మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, బొబ్బిలి రామకృష్ణ, కార్పొరేషన్ ఛైర్మన్లు, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, సునీల్ కుమార్ రెడ్డి, విపుల్ గౌడ్, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.