అక్షరటుడే, కామారెడ్డి: Fake Land Registration | నకిలీ పత్రాలతో అసలు యజమాని స్థానంలో మరొకరిని నిలబెట్టి భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించిన (Property Registration ) ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి(Kamareddy police) డీఎస్పీ మధుసూదన్ తెలిపారు. తన కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు.
Fake Land Registration | దేవునిపల్లి పోలీస్ష్టేషన్ పరిధిలో..
దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ నగర్ కాలనీ, సర్వే నెం.210/1లో గల ప్లాట్ నెం.71 అసలు యజమాని ముక్తవరం వెంకటయ్య. అయితే రాజంపేట మండలం ఆర్గొండ గ్రామానికి చెందిన బండారి శ్రీనివాస్ రెడ్డి తనపై ఉన్న అప్పులు తీర్చుకునేందుకు కుట్ర పన్నాడు. అందులో భాగంగా శ్రీనివాస్ రెడ్డి తన భార్య బండారి సునీతను కొనుగోలుదారుగా, తాడ్వాయి మండలం ఎండ్రియల్ గ్రామానికి చెందిన తన మామ సంగారెడ్డిని అసలు యజమాని వెంకటయ్యగా నటింపజేసి, నకిలీ గుర్తింపు పత్రాలు సృష్టించి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించినట్లు డీఎస్పీ వివరించారు. అనంతరం ఆ భూమిని ఇతరులకు విక్రయించడంతో పాటు, ఆ తర్వాత పలువురి పేర్లపై వరుస రిజిస్ట్రేషన్లు జరిగినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.
Fake Land Registration | పోలీసుల విచారణలో..
పోలీసుల విచారణలో ప్రధాన నిందితుడు శ్రీనివాస్ రెడ్డి నేరం అంగీకరించడంతో అతనితో పాటు బండారి సునీత, సంగారెడ్డిలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ కేసులో ఉపయోగించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. భూముల కొనుగోలు సమయంలో ప్రజలు యాజమాన్య హక్కులు, లింక్ డాక్యుమెంట్లు, రెవెన్యూ రికార్డులు, ఈసీ లను తప్పనిసరిగా పరిశీలించాలని డీఎస్పీ సూచించారు. నకిలీ పత్రాలతో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ శ్రీధర్ గౌడ్, దేవునిపల్లి ఎస్సై రంజిత్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Caliber Mining IPO | మార్కెట్లోకి క్యాలిబర్ మైనింగ్ అండ్ లాజిస్టిక్స్ ఎంట్రీ.. 18 శాతం లాభాలతో లిస్టయిన కంపెనీ