అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Fee Reimbursement Arvind | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే కార్యక్రమం ఇందూరు నుంచే ప్రారంభమైందని.. విద్యార్థుల ఉసురు పోసుకుంటున్న రేవంత్రెడ్డికి పుట్టగతులుండవని ఎంపీ అర్వింద్ వ్యాఖ్యానించారు. నగరంలోని పాత కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇందూర్ రణభేరి’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు.
Fee Reimbursement Arvind | ఇందూరు గడ్డపైనే ఆలోచన పుట్టింది..
ఇందూరు గడ్డపైనే ఫీజ్ రీయింబర్స్మెంట్ ఆలోచన పుట్టిందని ఎంపీ అర్వింద్ (MP Arvind) అన్నారు. 2004లో పీసీసీ చీఫ్ డీఎస్ అప్పటి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చారన్నారు. అప్పటి సీఎం రాజశేఖర్రెడ్డి ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చాక అనేక మంది పేద విద్యార్థులు లబ్ధి పొందారన్నారు. ఈ పథకం పేద విద్యార్థులకు వరంగా మారిందన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Fee Reimbursement Arvind | కేసీఆర్ డేంజరస్ అయితే.. రేవంత్రెడ్డి డిజాస్టర్

కేసీఆర్ డేంజరస్ అయితే.. రేవంత్రెడ్డి డిజాస్టర్ అని ఎంపీ అర్వింద్ వ్యాఖ్యానించారు. యువ వికాసం పేరుతో ఫీజ్ రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు మేనిఫెస్టోలో చేర్చిందన్నారు. రూ.12వేల కోట్ల బకాయిలు తీరుస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హామీని తుంగలో తొక్కిందన్నారు. రూ.12వేల కోట్లు బకాయిలు ఉంటే.. కంటితుడువుగా రూ.200 కోట్లు విడుదల చేశారని.. అవి ఏ మూలకు సరిపోతాయే రేవంత్రెడ్డి చెప్పాలని ఎంపీ అన్నారు. రాయదుర్గంలో, ఉస్మాన్సాగర్ తదితర ప్రాంతాల్లో భూములు అమ్మితే రూ.వేల కోట్లు వచ్చాయని.. వాటిని ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.
Fee Reimbursement Arvind | రీయింబర్స్మెంట్ ఇవ్వాలంటే కమీషన్లు కావాలట..

ఏపీలో చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ బాగా చేస్తున్నారని.. సీఎం రేవంత్రెడ్డి ఆయన దగ్గరికి వెళ్లి పరిపాలన ఎలా చేయాలో నేర్చుకోవాలని ఎంపీ సూచించారు. రాష్ట్రంలో విద్యరాని వ్యక్తి విద్యాశాఖకు మంత్రిగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటే కమీషన్లు కావాలని రేవంత్రెడ్డి అడుగుతున్నాడని ఆరోపించారు. ఎంసెట్లో పదివేలలోపు ర్యాంక్ వస్తేనే బకాయిలు చెల్లిస్తామని సైతం రూల్ తీసుకొచ్చారన్నారు. ప్రజా ఉద్యమాలకు విద్యార్థులను వాడుకుని తర్వాత వారిని వదిలేశారన్నారు.
Fee Reimbursement Arvind | రేవంత్రెడ్డి కమీషన్లు పక్కకు పెట్టి..
రేవంత్ రెడ్డి ముందు తన కమీషన్లు పక్కన పెట్టి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. దేశ భవిష్యత్తుకు యువతే ఆధారమని పేర్కొంటూ అనేక పథకాలను పీఎం మోదీ తీసుకొస్తుంటే.. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు యువత ఉసురు పోసుకుంటోందన్నారు. విద్యార్థుల రీయింబర్స్మెంట్ను పక్కన పెట్టి మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ అంటూ తిరుగుతున్నాడన్నారు. ‘తొక్కుతా.. మెడలో వేసుకుంటా..’ అంటూ రేవంత్రెడ్డి రాష్ట్రానికి సీఎంగా కాకుండా ఒక వీధి రౌడీగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. విద్యార్థులు భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలకు బీజేపీ ఆధ్వర్యంలో పూర్తి మద్దతు ఇస్తామన్నారు.
Fee Reimbursement Arvind | అహంకారం తలకెక్కింది..
సీఎం రేవంత్రెడ్డికి అహంకారం తలకెక్కిందని ఎమ్మెల్యే రాకేష్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ లేక గోస పడుతున్నారన్నారు. నేటి విద్యార్థుల భవిష్యత్తే దేశ భవిష్యత్తు అని వారి బకాయిలు ఆపి అధోగతి పాలు చేయవద్దని రాకేష్ రెడ్డి కోరారు. రేవంత్రెడ్డి.. ఆయన అన్నదమ్ములు కలిసి రాష్ట్రంలో వేలకోట్ల అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, రాష్ట్ర కార్యదర్శి స్రవంతిరెడ్డి, కార్యవర్గ సభ్యులు కంచెట్టి భూమన్న, మల్లికార్జున్ రెడ్డి, గద్దె భూమన్న, బీజేపీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Fake Documents | ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించిన ముఠా అరెస్ట్..