అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Municipality | కామారెడ్డి మున్సిపాలిటీ మరో వివాదానికి కేంద్రంగా మారింది. బల్దియాలో పలువురు ప్రైవేట్ వ్యక్తులు పెత్తానం చెలాయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కార్యాలయంలో అధికారులు స్వతంత్రంగా పని చేయలేకపోతున్నారని ఇటీవల ప్రచారం జోరుగా సాగుతోంది. సదరు వ్యక్తులు ఆఫీసులోకి వెళ్లగానే అధికారులు సైతం సలాం కొట్టేలా అజమాయిషీ చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.
బల్దియాలోని ఇంజినీరింగ్, ఆరోగ్యం, వాటర్ వర్క్స్, రెవెన్యూ ఇలా ప్రతి శాఖలోనూ ప్రైవేట్ వ్యక్తుల ప్రభావం ఉందని ప్రచారం సాగుతోంది. కాంట్రాక్టర్ల ఎంపిక నుంచి రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్ల పనుల వరకు అంతా వారి సిఫార్సుల మేరకే జరుగుతోందని తెలుస్తోంది. ఇలా అయితే ప్రజలు ఓటేస్తే గెలిచిన మా పరిస్థితి ఏమిటన్న ప్రశ్న కౌన్సిలర్ల నుంచి వస్తోంది. ఈ మేరకు బీఆర్ఎస్ కౌన్సిలర్లు అడిషనల్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులు తిష్ట వేశారని వారు ఆరోపించారు. అన్ని పనుల్లో వారు తలదూరుస్తున్నారని పేర్కొన్నారు. ప్రైవేట్ వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఆరోపణలపై ముఖ్య నేతలు ఇంకా స్పందించలేదు.
Kamareddy Municipality | ప్రజాప్రతినిధులు దృష్టి సారించేనా

కామారెడ్డి మున్సిపాలిటీ (Kamareddy Municipality) వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నికల్లో అధికార పార్టీకి బహిరంగ మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్ ప్రస్తుతం ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీకి మిత్రపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఫిర్యాదు చేయడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వరుస వివాదాలపై ముఖ్య నాయకులు దృష్టి సారిస్తారా..? అందరిని ఏకతాటిపైకి తీసుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇది కూడా చదవండి..: Shabbir Ali Farmhouse | షబ్బీర్ అలీ గెస్ట్ హౌస్ కాంపౌండ్ కూల్చివేత..