అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | ఇటీవల జాతీయ రహదారిపై పనస పండ్ల మాటున గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముఠాను కామారెడ్డి పోలీసులు (Kamareddy Police) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరో ఇద్దరిని తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Kamareddy SP | ప్రత్యేక బృందాలతో..
కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాలతో ఏర్పాటైన ప్రత్యేక బృందాలు ఒడిశా రాష్ట్రానికి వెళ్లి పరారీలో ఉన్న ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్టు చేశాయి. అరెస్టైన వారు ఒడిశా(Odisha) కంధమాల్ జిల్లా సారంగఢ మండలం గుంజిబాడి గ్రామానికి చెందిన రాజు అలియాస్ రాజ్ కిషోర్ ప్రధాన్, దీపక్ అలియాస్ దీపక్ ప్రధాన్గా పోలీసులు గుర్తించారు.
విచారణలో ఒడిశాలోని అటవీ ప్రాంతాల్లో గంజాయి సాగు చేసి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు నిందితులు అంగీకరించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కరీముల్లాకు ఇప్పటికే 387 కిలోల గంజాయిని ఇచ్చామని, మరో 12 కిలోలకు చెల్లింపు తర్వాత ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నామని సదరు నిందితులు తెలిపినట్లు ఎస్పీ వివరించారు.
Kamareddy SP | 12 కిలోల గంజాయి..
నిందితుల వద్ద నుంచి 12 కిలోల గంజాయి, రూ.6 లక్షల విలువైన సరకుతో పాటు నేరాలకు వినియోగించిన రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని ట్రాన్సిట్ వారెంట్పై కామారెడ్డికి తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచారు.
ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల సాగు, రవాణా, విక్రయాలపై రాజీ లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. డ్రగ్స్కు సంబంధించిన సమాచారం ఉన్నవారు వెంటనే పోలీసులకు తెలియజేయాలని, డ్రగ్స్ రహిత కామారెడ్డిని నిర్మించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : మల్టీ జోన్ – 1 ఐజీగా రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా