KTR Allegations | ‘అనుముల’ బ్రదర్స్​ అక్రమాలు.. కేటీఆర్​ సంచలన ఆరోపణలు

రేవంత్​రెడ్డి సోదరులపై బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ సంచలన ఆరోపణలు చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : KTR Allegations | బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి సోదరులు షెల్​ కంపెనీల పేరిట అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. డొల్లా కంపెనీల బాగోతాన్ని బయట పెడతానన్నారు.

మంగళవారం ఆయన తెలంగాణ భవన్​లో మీడియాతో మాట్లాడారు. రూ. లక్షతో మొదలైన టెస్సెరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి రూ.200 కోట్ల విలువైన 5 ఎకరాల భూమిని రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వం కేటాయించిందని ఆరోపించారు. ఈ కంపెనీ ఛైర్మన్​గా రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి ఉన్నారన్నారు.

రేవంత్​రెడ్డి సోదరులపై కేటీఆర్​ తీవ్ర విమర్శలు చేశారు. వారికి పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదని, వీళ్ళందరూ ఉన్నట్లుండి కోట్లు బూట్లు వేసుకొని పెద్ద పెద్ద కంపెనీలకు ఛైర్మన్లు ఎలా అయ్యారని ప్రశ్నించారు. ఈ కంపెనీలో కనీసం ఒక్క ఉద్యోగి కూడా లేడన్నారు. రేవంత్ రెడ్డి తన మరో సోదరుడు అనుముల జగదీష్ రెడ్డితో అమెరికాలో రూ.1000 కోట్లతో స్వచ్ బయో అనే కంపెనీ పేరు మీద ఎంవోయూ చేసుకున్నారని కేటీఆర్​ ఆరోపించారు. జగదీష్ రెడ్డికి కూడా ఎక్కడ భూమి ఇచ్చారో తవ్వి తీయాలని డిమాండ్​ చేశారు.

KTR Allegations | బావమరిదికి కాంట్రాక్ట్​

మోదీ ప్రభుత్వంతో కలిసి రేవంత్ రెడ్డి తన బావమరిది సృజన్ రెడ్డికి రూ.1137 కోట్ల అమృత్ కాంట్రాక్ట్ ఇచ్చారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం కలిసి నడుపుతున్న సింగరేణిలో వేల కోట్ల కుంభకోణాలు సృజన్ రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్నారు. బహిరంగంగా టెస్సరాక్ట్ కంపెనీ ఛైర్మన్ తానే అని కొండల్ రెడ్డి ప్రచారం చేసుకుంటుంటే, రేవంత్ రెడ్డి సోదరుడికి దీనికి సంబంధం లేదని శ్రీధర్ బాబు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్ం చేశారు. తన శాఖలో ఏం జరుగుతుందో ఆయనకు తెలుసా అన్నారు.

KTR Allegations | యాగం చేస్తే లాభం ఏమిటి

మోటర్లు ఆన్ చేయకుండా యాగాలు చేస్తే లాభమేంటని కేటీఆర్​ అన్నారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి మాత్రమే వరుణ యాగం చేశారన్నారు. తెలంగాణలో ఏడు ప్రాజెక్టులను రద్దు చేసే అంశంపై జీఆర్​ఎంబీ జరిగే మీటింగ్‌ను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం బాయ్‌కాట్ చేయకపోతే జలసౌధను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆ అనుమతులు రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం పట్టుబడితే అజెండాలో పెట్టారన్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీలకు సిగ్గుంటే ఆ మీటింగ్‌ను బాయ్‌కాట్ చేయాలన్నారు. తెలంగాణ రైతుల తరఫున తాము పోరాడుతామన్నారు. ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చారని, కానీ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చెప్పినా, చేతకాని బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు మౌనంగా ఉన్నారన్నారు.

ఇది కూడా చదవండి..: SIR Telangana | రాష్ట్రంలో ముగిసిన ఎస్​ఐఆర్​.. కోటి ఓట్లు తొలగించే అవకాశం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *