అక్షరటుడే, నిజామాబాద్ : Land Registrations | నందిపేట మండలంలో ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారం జిల్లాలో తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. అక్రమాలకు పాల్పడిన తహశీల్దార్ సంతోష్ రెడ్డిపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. కాగా.. ఇలాంటి అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో నందిపేట తహశీల్దార్ కార్యాలయంలో గతంలో పనిచేసిన ఓ ఆపరేటర్ పాత్ర ప్రధానంగా ఉందని సమాచారం. కేవలం ఔట్సోర్సింగ్ ఉద్యోగి అయిన సదరు ఆపరేటర్ ప్రస్తుతం రూ. కోట్లలో ఆస్తులు కూడగట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Land Registrations | దొడ్డిదారిలో ఇతరుల పేరిట బదిలీ
ప్రభుత్వ, అసైన్డ్ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు, సిబ్బంది వాటిని దొడ్డిదారిలో ఇతరుల పేరిట బదిలీ చేస్తున్నారు. ఈ విషయమై నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదిక అందించాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం అక్రమాలకు పాల్పడేవారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. కాగా.. నందిపేట మండలంలో పనిచేస్తున్న సంతోష్ రెడ్డిపై ఆది నుంచి ఆరోపణలు రావడం, అసైన్డ్ భూములను అక్రమంగా ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసి పెట్టడం వంటి అంశాలపై ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో విచారణ జరిపించిన కలెక్టర్ ఆయనను సత్వరం విధుల నుంచి తొలగిస్తూ ఈ నెల 16న ఉత్తర్వులు జారీ చేశారు.
Land Registrations | ఆపరేటర్ కీలక పాత్ర
నందిపేట మండలంలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చినప్పటికీ.. గత ఐదారేళ్లుగా ఈ మండలంలో పనిచేసిన భూ భారతి (గతంలో ధరణి) ఆపరేటర్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. సంతోష్ రెడ్డి అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం పక్కన పెడితే గతంలో జరిగిన లావాదేవీలన్నీ కూడా సదరు ఆపరేటర్ కనుసన్నల్లోనే పూర్తయినట్లు సమాచారం. ఇతర సిబ్బంది ఎవరికీ తెలియకుండా అప్పటి తహశీల్దార్లు, సదరు ఆపరేటర్ అక్రమ రిజిస్ట్రేషన్లు జరిపినట్లు ఆరోపణలున్నాయి. సంతోష్రెడ్డికి ముందుకు పనిచేసిన ఓ తహశీల్దార్ సైతం ఇలాంటి ఆరోపణలే మూట గట్టుకున్నారు. అలాగే గతంలో పనిచేసిన మరో తహశీల్దార్కు సైతం షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. కానీ, సదరు ఆపరేటర్పై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాగా.. ఈ మధ్యనే పొరుగున ఉన్న మండలానికి బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు. సంతోష్ రెడ్డి వ్యవహారంలో విచారణ జరుపుతున్న అధికారులు సదరు ఆపరేటర్, అప్పటి అధికారుల వ్యవహారంలోనూ లోతుగా వివరాలు ఆరా తీస్తే మరిన్ని భూ అక్రమాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని సొంత కార్యాలయ సిబ్బంది చర్చించుకుంటున్నారు.
ఇది కూడా చదవండి..: Nasha Mukt Bharat | మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి..