అక్షరటుడే, వెబ్డెస్క్ : Nitin Nabin Telangana Visit | తెలంగాణపై బీజేపీ (BJP) ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంటా ఇటీవల బెంగాల్ (Bengal) ఘన విజయం సాధించిన అనంతరం ప్రధాని మోదీ హైదరాబాద్ (Hyderabad)లో బహిరంగ సభకు హాజరు అయ్యారు. తాజాగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాష్ట్ర పర్యటనకు రానున్నారు.
రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు. అయినా.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. మరోవైపు నేతల మధ్య వివాదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. కీలక నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో అవకాశం ఉన్నా బీజేపీ ఎదగలేకపోతుంది. మరోవైపు బీఆర్ఎస్ దూకుడు పెంచింది. ఇటీవల వరుస సమావేశాలు పెట్టి క్యాడర్లో జోష్ నింపుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ అధిష్టానం సైతం రాష్ట్రంపై ఫోకస్ పెట్టింది.
Nitin Nabin Telangana Visit | మూడు రోజుల పర్యటన

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాష్ట్రంలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ప్రస్తుతం పార్టీ నేతల మధ్య విభేదాలపై ఆయన చర్చించనున్నారు. పార్టీ బలోపేతంపై నేతలకు కీలక సూచనలు చేయనున్నారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని దిశా నిర్దేశం చేయనున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు వర్గాల్లో వ్యతిరేకత ఉంది. దానిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. యూరియా యాప్కు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తోంది. మరోవైపు బీజేపీ నేతలు సైలెంట్గా ఉంటున్నారు. నేతలు అందరు ఏకతాటిపైకి వచ్చి.. ప్రజల సమస్యలపై పోరాటాలు చేస్తే పార్టీ బలోపేతం అయ్యే అవకాశం ఉంది.
Nitin Nabin Telangana Visit | సన్నాహాక సమావేశం
నితిన్ నబిన్ రాక నేపథ్యంలో ఎంపీ ఈటల రాజేందర్ శనివారం కార్యకర్తలు, నాయకులతో సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఎస్ఐఆర్ (SIR) కోసం నియమించిన బీఎల్ఏలతో నబిన్ మాట్లాడుతారని తెలిపారు. నాంపల్లి పార్టీ ఆఫీస్ పక్కన ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో దాదాపు 12 వేల మంది బీఎల్ఏలతో మీటింగ్ ఉంటుందని పేర్కొన్నారు.
దీనిని కూడా చదవండి : TG RERA | రెరా ఛైర్మన్గా శ్రీనివాసరాజు నియామకం