అక్షరటుడే, వెబ్డెస్క్ : Pakistan Bomb Blast | పాకిస్థాన్లో బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో పాక్ పోలీసు సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని జరిగిన పేలుడులో ఏడుగురు మరణించగా, మరో 18 మంది గాయపడ్డారు.
స్వాత్ జిల్లాలోని ఒక పట్టణంలో ‘శాంతి ర్యాలీ’ జరుగుతున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. గత కొన్ని నెలలుగా భద్రతా పరిస్థితి క్షీణించిన ఈ ప్రాంతంలో శాంతిని కోరుతూ, స్థానిక గిరిజన మండలి అయిన స్వాత్ అమన్ జిర్గా ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పాల్గొన్నవారు నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ క్రమంలో పేలుడు చోటు చేసుకుంది. దీనిని ఆత్మహుతి దాడిగా పోలీసులు భావిస్తున్నారు. గాయపడిన వారిని అధికారులు ఆస్పత్రులకు తరలించారు.
Pakistan Bomb Blast | భయంతో పరుగులు
ర్యాలీలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పేలుడు చోటు చేసుకోవడంతో వారు భయంతో పరుగులు తీశారు. పోలీసులు, ఇతర అధికారులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. దాడి ఎవరు చేశారనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ సంస్థ కూడా దాడికి బాధ్యత వహించలేదు.
దీనిని కూడా చదవండి : MP Pappu Yadav | ఎంపీ పప్పు యాదవ్పై దాడికి యత్నం.. ఇద్దరి అరెస్ట్