అక్షరటుడే వెబ్డెస్క్: Pawan Kalyan Telangana | తెలంగాణలో జనసేన పార్టీ ‘నవ నిర్మాణ సభ’కు హైకోర్టు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ( Pawan Kalyan) హైదరాబాద్లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయ విశ్లేషకులు, కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో తనకు అధికారంపై ఆశ లేదని, కేవలం మార్పు కోసమే పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. ఒక విశ్లేషకుడి తప్పుడు వ్యాఖ్యల వల్లే ఈ వివాదమంతా మొదలైందని.. ఆయనపై కేసులు పెట్టిన విషయం మొదట్లో తనకు తెలియదన్నారు. ఆ విశ్లేషకుడిపై ఉన్న గౌరవంతో ఆ కేసులను వెనక్కి తీసుకోమని తానే స్వయంగా చెప్పానని, అయినా సరే ఆయన ప్రెస్ క్లబ్లో ప్రెస్మీట్ పెట్టి మరీ నన్ను తిట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారి వల్లే కమ్యూనిజం అంతరించిపోయిందని విమర్శించారు. తెలంగాణలో వచ్చే ప్రతి సమస్యకూ ఆంధ్రవాళ్లను బాధ్యులను చేయడం ఏంటని ప్రశ్నించారు.
Pawan Kalyan Telangana | గద్దరన్నకు కారు కొనిచ్చా..
ప్రజా గాయకుడు గద్దర్ గురించి పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. “గద్దరన్న బతికున్న రోజుల్లో ఇప్పుడు మాట్లాడుతున్న వారంతా ఎక్కడున్నారు?” అని ప్రశ్నించారు. ‘తమ్ముడూ.. శరీరంలో బుల్లెట్లు ఉన్నాయి, సరిగ్గా నడవలేకపోతున్నాను.. ఒక కారు కొనివ్వు’ అని గద్దరన్న తనను అడిగితే, కేవలం మూడు రోజుల్లోనే ఆయనకు కారు కొనిచ్చానని గుర్తుచేశారు. నాడు వైఎస్ఆర్ బతికి ఉన్నప్పుడు తెలంగాణపై కాంగ్రెస్ నేతల గొంతులు ఎందుకు లేవలేదని ప్రశ్నించారు. తనపై తొలి కేసు నమోదైంది కూడా తెలంగాణలోనేనని పవన్ తెలిపారు.

Pawan Kalyan Telangana | పాశం యాదగిరి తిట్టడం బాధించింది..
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ దక్షిణాదిలో ఎక్కడైనా పోటీ చేయవచ్చని.. గతంలో ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేస్తే తప్పులేదు కానీ, జనసేన తెలంగాణలో ప్రజల తరఫున పోరాడితే కాంగ్రెస్ నాయకులకు ఎందుకు తప్పుగా కనిపిస్తోందని పవన్ సెటైర్లు వేశారు. పాశం యాదగిరి లాంటి సీనియర్ జర్నలిస్టు కూడా తనను తిట్టడం తీవ్ర బాధ కలిగించిందన్నారు. గతంలో వారితో తన ఇంట్లోనే ఎన్నోసార్లు భేటీ అయ్యానని చెప్పారు. “మీరు ఎంత భయపెట్టాలని చూస్తే.. మా గుండె అంత గట్టిపడుతుంది” అంటూ విమర్శకులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు.

Pawan Kalyan Telangana | 2029లో తెలంగాణలో పోటీ..
తనపై జరుగుతున్న ఈ విమర్శల వెనుక సీఎం రేవంత్ రెడ్డి గానీ, కేసీఆర్ గానీ ఉన్నారని తాను భావించడం లేదన్నారు. రాష్ట్రాల మధ్య పెరుగుతున్న ప్రాంతీయ విద్వేషాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. ఇక రాబోయే 2029 సాధారణ ఎన్నికల్లో బీజేపీ తమతో కలిసి వచ్చినా, రాకపోయినా తెలంగాణలో జనసేన కచ్చితంగా పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. ఇక్కడ తాను వ్యక్తిగతంగా పోటీ చేయనని, తన పార్టీ అభ్యర్థులు గెలిస్తే చాలన్నారు. అలాగే త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Grama sabha | గ్రామ, వార్డు సభలను విజయవంతం చేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి


