అక్షరటుడే, భీమ్గల్: Pond Drowning | అప్పటివరకు కళ్లముందే ఆడుకుంటూ, నవ్వుతూ తిరిగిన ఆ చిన్నారులను మృత్యువు కుంట రూపంలో బలితీసుకుంది. సరదాగా స్నానానికి వెళ్లిన ఆ పసిమొగ్గలు ఈత రాక, నీటి లోతు తెలియక అనంత లోకాలకు వెళ్లిపోయారు. భీమ్గల్ (Bheemgal) పరిధిలోని లింబాద్రిగుట్టలో (Limbadrigutta) ఈ ఘటన చోటు చేసుకుంది.
Pond Drowning | ఆడుకుంటూ వెళ్లి..
భీమ్గల్ ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. లింబాద్రిగుట్ట వడ్డెర కాలనీకి చెందిన ద్యారంగుల అర్వింద్ (4), కంది వర్షిని (5), కంది హరీష్ (10) ముగ్గురు చిన్నారులు శుక్రవారం ఉదయం ఇంటి ముందు సరదాగా ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో కాలనీ పక్కనే ఉన్న బ్రాహ్మణ కుంట వద్దకు వెళ్లారు. ఎండ తీవ్రత కారణంగా వారు స్నానం చేసేందుకు కుంటలోకి దిగారు. అయితే ముగ్గురిలో ఎవరికీ ఈత రాకపోవడం, కుంట లోతు ఎక్కువగా ఉండటంతో నీట మునిగి ఊపిరాడక ప్రాణాలు విడిచారు.
Pond Drowning | గాలింపు చర్యలు..

మధ్యాహ్నమైనా పిల్లలు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన అర్వింద్ తండ్రి సురేశ్ పరిసర ప్రాంతాల్లో వెతికారు. చిన్నారుల ఆచూకీ లభించకపోవడంతో వెంటనే భీమ్గల్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే భీమ్గల్(Bheemgal Police) ఎస్సై తన సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది, గజఈతగాళ్లను రప్పించి బ్రాహ్మణ కుంటలో గాలింపు చర్యలు చేపట్టారు. గజఈతగాళ్ల సాయంతో తీవ్రంగా శ్రమించి ముగ్గురి మృతదేహాలను కుంటలో నుంచి వెలికితీశారు.
Pond Drowning | తల్లిదండ్రులకు గుండెకోత..
బిడ్డలు నిర్జీవంగా పడి ఉండటాన్ని చూసిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించిన తీరు అక్కడున్న వారికి కన్నీళ్లు తెప్పించింది. ‘పొద్దున్నే కళ్లముందు ఆడుకున్న బిడ్డలు.. ఇలా శవాలైపోతారనుకోలేదు’ అంటూ తల్లిదండ్రులు రోదించిన తీరు అక్కడివారిని కలిచివేసింది.
తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి..: తిరుపతి, ఎస్సై భీమ్గల్
ఈ ప్రమాదం అత్యంత దురదృష్టకరం. చెరువులు, కుంటల వద్దకు పిల్లలు ఒంటరిగా వెళ్లకుండా తల్లిదండ్రులు ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండాలి. గ్రామాల్లోని వారు సైతం జాగ్రత్తలు తీసుకోకుండా చెరువులు, కుంటల వద్దకు స్నానాలకు వెళ్లవద్దు. ఈత వస్తేనే నీళ్లలోకి దిగాలి. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.

ఇది కూడా చదవండి: Revanth Reddy Challenge | దమ్ముంటే అసెంబ్లీకి రా.. కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్
