అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | నేర నియంత్రణతో పాటు ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ రాజేష్ చంద్ర అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో(Kamareddy SP Office) సీసీటీఎన్ఎస్ ద్వారా జిల్లాలో నమోదైన కేసుల పురోగతి, నేర నియంత్రణ చర్యలు, దర్యాప్తు పనితీరుపై నెలవారి నేర సమీక్ష(Crime Review Meeting) సమావేశం నిర్వహించారు.
SP Rajesh Chandra | ప్రతికేసును గడుపులోగా పూర్తిచేయాలి..
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో నమోదయ్యే ప్రతి కేసును నాణ్యమైన దర్యాప్తుతో చట్టపరమైన గడువులోగా పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలన్నారు. పెండింగ్ కేసులను ప్రత్యేక దృష్టితో పరిశీలించి దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు సకాలంలో ఛార్జిషీట్లు దాఖలు చేసి నిందితులకు శిక్షలు పడేలా చూడాలని సూచించారు. సీసీటీఎన్ఎస్ 2.0(CCTNS) అమలులో భాగంగా ప్రతి కేసు వివరాలను నిర్దేశిత గడువులోగా ఆన్లైన్లో పూర్తిస్థాయిలో నమోదు చేసి ఎలాంటి పెండెన్సీ లేకుండా నవీకరించాలని ఆదేశించారు. జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాలు, మట్కా, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని, రాత్రి వేళల్లో బస్సులు, అనుమానాస్పద వాహనాలు, కీలక ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టాలన్నారు.
SP Rajesh Chandra | బీట్ వ్యవస్థను పటిష్టం చేయాలి..
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పగలు, రాత్రి బీట్ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లపై ఆకస్మిక తనిఖీలు చేయాలని స్పష్టం చేశారు. వర్షాకాల నేపథ్యంలో వరదలు, భారీ వర్షాలకు సంబంధించిన ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని, ఇతర శాఖలతో సమన్వయంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, డ్రంకన్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, అధిక వేగంపై ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలన్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు సోషల్ మీడియాలో శాంతిభద్రతలకు భంగం కలిగించే పోస్టులు, తప్పుడు ప్రచారాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్లలో అందుబాటులో ఉన్న మ్యాన్పవర్కు అనుగుణంగా డ్యూటీ రోస్టర్ రూపొందించి సమర్థవంతంగా అమలు చేయాలని, సిబ్బందిపై అధిక పనిభారం పడకుండా బాధ్యతలు కేటాయించాలని ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నర్సింహ రెడ్డి, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, ప్రత్యేక విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: #Hyderabad | ఉప్పర్పల్లి బార్బీక్యూ నేషన్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు