అక్షరటుడే, వెబ్డెస్క్: Telangana Pension Verification | తెలంగాణ రాష్ట్రంలో సామాజిక భద్రతా పెన్షన్ల పరిశీలన (వెరిఫికేషన్) ప్రక్రియలో భాగంగా సుమారు 1.28 లక్షల పెన్షన్లను ప్రభుత్వం రద్దు చేసినట్లు అధికార వర్గాల సమాచారం.
అర్హత ప్రమాణాలకు అనుగుణంగా లేని లబ్ధిదారుల పేర్లను జాబితా నుంచి తొలగించగా, కొత్త అర్హులైన వికలాంగులు, వితంతువులకు పెన్షన్లు మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
Telangana Pension Verification | ఇటీవలే సర్వే..
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారుల వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ పరిశీలనలో మృతి చెందిన వ్యక్తులు, ప్రస్తుతం అందుబాటులో లేని వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు, ఐదు ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి కలిగిన వారు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు (ట్యాక్స్ పేయర్లు) వంటి వర్గాలకు చెందిన లబ్ధిదారుల పేర్లను జాబితా నుంచి తొలగించినట్లు సమాచారం.
Telangana Pension Verification | గ్రామీణ ప్రాంతాల్లోనే అధికం..
రద్దైన మొత్తం పెన్షన్లలో సుమారు 1.02 లక్షల పెన్షన్లు గ్రామీణ ప్రాంతాలకు చెందినవిగా ఉండగా, మిగతావి మున్సిపాలిటీలు, పట్టణ ప్రాంతాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చర్యల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
Telangana Pension Verification | కొత్త లబ్ధిదారులు..
ఇక ఖాళీ అయిన పెన్షన్ కోటాలో కొత్త లబ్ధిదారులను చేర్చేందుకు అధికారులు ప్రత్యేకంగా జాబితాను సిద్ధం చేశారు. ఇందులో సుమారు 48 వేల మంది వికలాంగులు, వితంతువులు ఉన్నట్లు సమాచారం. వారి అర్హతలను తుది స్థాయిలో పరిశీలించిన అనంతరం కొత్త పెన్షన్ల మంజూరుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
పెన్షన్ వ్యవస్థలో పారదర్శకత పెంపు, అర్హులకు మాత్రమే సంక్షేమ ప్రయోజనాలు అందేలా చేయడం, నకిలీ లేదా అనర్హ లబ్ధిదారులను గుర్తించి తొలగించడం వంటి లక్ష్యాలతో ఈ వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.