అక్షరటుడే వెబ్డెస్క్:Telangana Prisoner Release|తెలంగాణ రాష్ట్రంలో మంచి ప్రవర్తన, క్రమశిక్షణ కనబరిచిన 92 మంది జీవిత ఖైదీల ముందస్తు విడుదలకు గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా(Shiv Pratap Shukla)అధికారికంగా ఆమోదం తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న శాశ్వత రిమిషన్ విధానంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Telangana Prisoner Release|సుప్రీంకోర్టు ఆదేశాలు ..
2025 ఫిబ్రవరి 18న ‘సోనాధర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఈ ప్రక్రియ ఊపందుకుంది. జీవిత ఖైదీల ప్రత్యేక రిమిషన్ కోసం ఒక స్పష్టమైన కాలపట్టికను రూపొందించాలని అత్యున్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. దీనికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం 2025 అక్టోబర్ 27న ‘జీఓ ఎంఎస్ నెం.126’ను జారీ చేస్తూ శాశ్వత మార్గదర్శకాలను అమల్లోకి తెచ్చింది. ఈ విధానం ప్రకారం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1, జూన్ 1, అక్టోబర్ 1 తేదీలను కట్-ఆఫ్ తేదీలుగా నిర్ణయించి, ఏడాదికి మూడు సార్లు అర్హులైన ఖైదీల వివరాలను పరిశీలిస్తున్నారు.
Telangana Prisoner Release|అర్హుల గుర్తింపు ..
2026 ఫిబ్రవరి 1 నాటికి అర్హత సాధించిన ఖైదీల జాబితాను తెలంగాణ జైళ్ల శాఖ సిద్ధం చేసింది. జైళ్ల సూపరింటెండెంట్లు ప్రాథమికంగా రూపొందించిన ఈ జాబితాను మొదట ఉన్నతాధికారుల కమిటీ స్క్రూటినీ చేసింది. ఆ తర్వాత హోం శాఖ, న్యాయశాఖ, జైళ్ల శాఖల ప్రతినిధులతో కూడిన ‘స్టాండింగ్ కమిటీ’ దీనిపై తుది సిఫారసులు చేసింది. ఈ సిఫారసులకు ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన అనంతరం ప్రతిపాదనలను గవర్నర్ కార్యాలయానికి పంపారు. తాజాగా జరిగిన సమావేశంలో గవర్నర్ ఈ జాబితాను పరిశీలించి ఆమోదముద్ర వేశారు. ఈ ఉన్నత స్థాయి సమీక్షలో అధికారులు డాక్టర్ సౌమ్య మిశ్రా, ఎన్.మురళి బాబు పాల్గొన్నారు.
Telangana Prisoner Release|లబ్ధిదారుల వివరాలు..
ప్రస్తుతం గవర్నర్ ఆమోదం పొందిన 92 మంది ఖైదీలలో 86 మంది పురుషులు, 6 మంది మహిళా ఖైదీలు ఉన్నారు. వీరంతా త్వరలోనే జైళ్ల నుంచి విడుదల కానున్నారు. కాగా, గతంలో కూడా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. 2024 జూలై 2న జారీ చేసిన ‘జీఓ ఎంఎస్ నెం.37’ ద్వారా అప్పట్లో మొత్తం 213 మంది ఖైదీలకు (178 మంది పురుషులు, 35 మంది మహిళలు) ప్రత్యేక రిమిషన్ మంజూరు చేసి ముందస్తుగా విడుదల చేశారు.
Telangana Prisoner Release|ఖైదీల పునరావాసం..
శిక్షా కాలంలో తప్పులు తెలుసుకుని, ప్రవర్తనలో మార్పు తెచ్చుకున్న ఖైదీలకు సమాజంలో గౌరవంగా బతికేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ ముందస్తు విడుదల ప్రక్రియ ఖైదీల పునరావాసానికి తోడ్పడటమే కాకుండా, జైళ్లలో అంతకంతకూ పెరుగుతున్న రద్దీని తగ్గించడానికి సహాయపడుతుంది. న్యాయ వ్యవస్థ ఆశించే మానవీయ విలువలను ఆచరణలో పెట్టేందుకు ఈ నిర్ణయం ఒక చక్కని ఉదాహరణగా నిలిచింది.
ఇది కూడా చదవండి: RTC Digital Services | ఆర్టీసీ టికెట్ బుకింగ్ కౌంటర్లలో డిజిటల్ సేవలు ప్రారంభం..


