అక్షరటుడే వెబ్డెస్క్:Telangana Rakshana Sena | తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బోడ జనార్థన్ తన అనుచరులతో కలిసి ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) పార్టీలో చేరారు. బంజారాహిల్స్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) ఆయనకు గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. చాలా చిన్న వయసులోనే వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, కార్మిక శాఖ మంత్రిగా, ఆర్టీసీ చైర్మన్గా పనిచేసిన గొప్ప అనుభవం బోడ జనార్దన్కు ఉందన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో నూతన ఒరవడి కోసం ఉద్భవించిన టీఆర్ఎస్ పార్టీకి ఆయన రాక మరింత బలాన్ని ఇస్తుందని, పార్టీలో ఆయన సీనియారిటీకి తగిన ప్రాధాన్యత, గౌరవం ఉంటాయని స్పష్టం చేశారు.
Telangana Rakshana Sena | విప్లవాత్మక ప్రణాళికతో ముందుకు..
తెలంగాణలోని అన్ని వర్గాల (సబ్బండ వర్గాల) ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేలా ఒక సరికొత్త, విప్లవాత్మక అభివృద్ధి ప్రణాళికను తాము సిద్ధం చేస్తున్నట్లు కల్వకుంట్ల కవిత వెల్లడించారు. ఈ మార్పు కోసం రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సమసమాజ స్థాపనే ధ్యేయంగా ఏర్పాటైన టీఆర్ఎస్, భవిష్యత్తులో తెలంగాణ ప్రజల సొంత ఇల్లుగా మారబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Telangana Rakshana Sena | కార్మికులను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం..
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి, ఆర్టీసీ కార్మికులను ఘోరంగా వంచిస్తోందని కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో తాను మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడే కార్మికులకు కనీస వేతనం రూ. 20 వేలు ఇవ్వాలని ముఖ్యమంత్రికి లేఖ రాశానని గుర్తుచేశారు. కానీ ఈ సీఎం ఆరేళ్ల తర్వాత ఇప్పుడు కేవలం రూ. 16 వేలు మాత్రమే ఖరారు చేసి, అదేదో గొప్ప కార్యం చేసినట్లు కలరింగ్ ఇస్తున్నారని, ఇది కార్మికులను మోసం చేయడమేనని మండిపడ్డారు.

Telangana Rakshana Sena | సింగరేణిలో అవినీతి..
ఒక రూపాయి అయ్యే పనికి పది రూపాయలు ఖర్చు చేస్తూ సింగరేణిలో భారీ అవినీతికి తెరలేపారని ఆరోపించారు. తెలంగాణ వచ్చాక సాధించుకున్న డిపెండెంట్ ఉద్యోగాలను కాంగ్రెస్ కాలరాస్తోందని, ఐఎన్టీయూసీ సాయంతో కార్మికుల హక్కులను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోడ జనార్దన్ రాకతో సింగరేణిలో తమ కార్మిక విభాగం ‘హెచ్ఎంఎస్’ మరింత బలోపేతం అవుతుందని, కార్మికుల కోసం పోరాటం ఉధృతం చేస్తామని చెప్పారు.
Telangana Rakshana Sena | ఆర్టీసీ కార్మికులపై నిర్లక్ష్యం..
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి రెండేళ్లపాటు నిద్రపోయిన ఈ ప్రభుత్వం, డ్రైవర్ రాజు గౌడ్ ఆత్మబలిదానం చేసుకునే వరకు కదల్లేదని విమర్శించారు. ప్రభుత్వంపై క్వశ్చన్ చేసిన ఒక ఆర్టీసీ డ్రైవర్ను ఉద్యోగం నుంచి తీసేస్తే, తాము పోరాడి తిరిగి చేర్పించాల్సి వచ్చిందని.. ప్రశ్నిస్తే తట్టుకోలేని ‘కరకు పాలన’ రాష్ట్రంలో సాగుతోందని ఎండగట్టారు.
Telangana Rakshana Sena | దాదాపు 25 సమస్యలను పరిష్కరించాం..
తాము కేవలం మాటలకే పరిమితం కాకుండా.. “ప్రశ్నించడం, పోరాడడం, సమస్యను పరిష్కరించడం” అనే సిద్ధాంతంతో పనిచేస్తున్నామని కవిత పేర్కొన్నారు. తాము చేపట్టిన ‘జనం బాట’ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లడం వల్లే ప్రభుత్వం దిగొచ్చి దాదాపు 25 సమస్యలను పరిష్కరించిందని గుర్తుచేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై తాము గళమెత్తడం వల్లే సీఎం రివ్యూ చేశారని, అలాగే నల్గొండలో 35 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బ్రిడ్జి పనులను కూడా ‘జనం బాట’ ఒత్తిడి వల్లే ఇప్పుడు ప్రారంభించారని కవిత స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Siddaramaiah Resignation | కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామా .. గవర్నర్ సెక్రటరీకి లేఖ అందజేత


