అక్షరటుడే, వెబ్డెస్క్: Telangana Rashtra Sena | రాష్ట్రాన్ని నాడు పరిపాలించిన కుటుంబంతో తాను కూడా ఓ భాగం అని కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) అన్నారు. ఆ కుటుంబంలో భాగం అయినందుకు కొన్ని విషయాల్లో సిగ్గు పడుతున్నానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను క్షమించాలని తెలంగాణ ప్రజలను కోరారు. కానీ తెలంగాణ సాధించినందుకు గర్వ పడుతున్నానని చెప్పారు.
కేసీఆర్ మారిన మనిషి అని కవిత అన్నారు. మన మనిషి కాదన్నారు. మర మనిషని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ కష్టమొచ్చినా ఆ సారు రారని విమర్శించారు. సామాజిక తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ ప్రజల ముందుకు వచ్చిందన్నారు. పార్టీ పేరు ప్రకటించిన అనంతరం కవిత జెండా ఆవిష్కరించారు. పసుపు, ఆకుపచ్చ, నీలం రంగులతో జెండా రూపొందించారు.

Telangana Rashtra Sena | 20 ఏళ్లుగా పోరాటం
తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ను స్వయంగా రాసుకోవడానికి మనలను దేవుడు భాగస్వామ్యం చేశాడన్నారు. ఈ రోజు కోసం చాలా మంది ఎదురు చూశారన్నారు. గత 20 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమంలో తాను పోషించిన పాత్ర ప్రజలకు తెలుసన్నారు. ఉద్యమంలో మహిళలను భాగస్వామ్యం చేయడానికి జాగృతి ఆధ్వర్యంలో పోరాటాలు చేశామన్నారు. జాగృతి వెలిగించిన దీపం ఉద్యమ సమయంలో కాంతిరేఖ అయిందన్నారు.
Telangana Rashtra Sena | కలల తెలంగాణ రాలేదు
తెలంగాణ (Telangana) వచ్చి 12 ఏళ్లు అయిన మన కలలు సాధ్యం కాలేదన్నారు. తెలంగాణ ఉద్యమ రథం దారి తప్పిందని కేసీఆర్ (KCR)ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అనేక పనులు జరగలేదన్నారు. బానిస సంకెళ్లు పోతాయని తెలంగాణ సాధించుకుంటే.. బీఆర్ఎస్ (BRS) పాలనలో రైతులకు బేడీలు పడ్డాయన్నారు. ఇసుక దందా కోసం నేరేళ్లలో దళితులపై దాడులు చేశారన్నారు. ఇద్దరు ఫోన్లో మాట్లాడుకోలేని పరిస్థితి ఉందని ఫోన్ ట్యాపింగ్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దారుణమైన నిఘా నీడలో ప్రజలు బతికారని ఆవేదన వ్యక్తం చేశారు. కలల తెలంగాణ రాలేదని చెప్పారు.
అమ్మగా మారాలనుకుంటున్నా..
బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను కోల్పోయిందన్నారు. దీంతోనే నేడు టీఆర్ఎస్ను ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ బిడ్డలకు తాను ఒక అమ్మగా మారాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అమ్మతనంతో పరిపాలన జరిగితే రాష్ట్రం ముందుకు మారుతుంది. సామాజిక తెలంగాణ సాధిస్తామని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి..: Kavitha New Party | కవిత కొత్త పార్టీ పేరు టీఆర్ఎస్

