Telangana SIR Process | రక్తం ప్యాకెట్లతో రాజకీయం వద్దు.. బీఆర్ఎస్ కుట్రలు బయటపెడతాం: మంత్రి పొన్నం

తెలంగాణలో ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియ గడువును పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ నేతల బృందం కోరింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana SIR Process | తెలంగాణలో ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియ గడువును పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ నేతల బృందం కోరింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ వినతి పత్రం సమర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్‌లో ఈ ప్రక్రియ 15 శాతం కూడా పూర్తి కాలేదని, బీఎల్ఓలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని తాము అధికారులను కోరినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ పార్టీ తీరుపై మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే కుంగిపోయిందని, రక్తం ప్యాకెట్లతో రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు. “ప్రాజెక్టు కూలడానికి కారణం బీఆర్ఎస్ పార్టీనే. వారి కుట్రలను గ్రామాల వారీగా ప్రజలకు వివరిస్తాం” అని స్పష్టం చేశారు. ఎన్డీఎస్ఏ (NDSA) ఇచ్చే నివేదిక ఆధారంగానే తాము తదుపరి చర్యలు తీసుకుంటామని, ఇంజనీర్ల సలహాలను పాటిస్తామని చెప్పారు.
ponnam.1

Telangana SIR Process | ప్రమాదం జరిగితే బాధ్యులెవరు?:

గత రెండు సంవత్సరాలుగా మౌనంగా ఉన్న బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు కరువు పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని మంత్రి ఆరోపించారు. “మేడిగడ్డ, కన్నెపల్లి ప్రాజెక్టులపై రాజకీయం చేయడం మానుకోవాలి. ఎన్డీఎస్ఏ నివేదిక రాకుండా, ప్రాజెక్టులో నీటిని నింపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ నీళ్లు నింపిన తర్వాత ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది?” అని మంత్రి ప్రశ్నించారు. కేటీఆర్, హరీశ్ రావు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా సలహాలు ఇవ్వాలే తప్ప, లేనిపోని ఆరోపణలు చేయవద్దని హెచ్చరించారు.

Telangana SIR Process | ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటాం..

రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని, దీనిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలన్నీ కలిసి పనిచేయాలని, కేంద్రంతో పోరాటంలో అందరూ ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

 

 

ఇది కూడా చదవండి:  Ketan Agarwal Murder | ప్రధాని మోదీకి కేతన్ తల్లి లేఖ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *