అక్షరటుడే వెబ్డెస్క్: Telangana SIR Process| తెలంగాణలో చేపట్టిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) ప్రక్రియలో ఎమ్మెల్యేల నిర్లక్ష్యాన్ని సీఎం రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) తీవ్రంగా తప్పుబట్టారు. ఈ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని, వారం రోజుల్లో పనితీరు మార్చుకోకుంటే ప్రత్యామ్నాయాలు చూస్తామని హెచ్చరించారు. పార్టీ కోసం పనిచేయని వారికి స్థానం లేదని స్పష్టం చేశారు.
Telangana SIR Process | వర్చువల్ భేటీలో సీఎం సీరియస్..
SIR ప్రక్రియపై జరిగిన వర్చువల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ప్రతినిధులు మీనాక్షి నటరాజన్, సచిన్ సావంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రతిపక్షాల కంటే వెనుకబడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.అధికారంలో ఉన్న మనం వెనుకబడి ఉంటే, నామమాత్రంగా ఉన్న బీజేపీ కూడా నియోజకవర్గాల్లో భారీగా సమావేశాలు నిర్వహిస్తోందని గుర్తుచేశారు. ఎమ్మెల్యేల పనితీరును తాము నిశితంగా గమనిస్తున్నామని, జిల్లాల వారీగా డేటా అంతా సేకరిస్తున్నామని హెచ్చరించారు. ఇన్-ఛార్జి మంత్రులు ఈ ప్రక్రియలో పూర్తి బాధ్యత తీసుకోవాలని సూచించారు.

Telangana SIR Process | ఎమ్మెల్యేల నిర్లక్ష్యంపై టీపీసీసీ చీఫ్ ఆగ్రహం..
ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, అనేక మంది ఎమ్మెల్యేలు SIR ప్రక్రియను తేలికగా తీసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. పార్టీ బలానికి పునాది అయిన ప్రతి ఓటును కాపాడటంలో ఎమ్మెల్యేలు చొరవ చూపాలని ఆయన స్పష్టం చేశారు. గడువులోగా పనితీరు మెరుగుపరుచుకోవాలని అధిష్టానం కఠిన సంకేతాలు పంపింది.
ఇది కూడా చదవండి: Executive Engineer Bribery | వారంలో రిటైర్మెంట్.. రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిన అధికారి